రుక్సా ట్విస్ట్: షేక్ను వదిలి రానని!, అప్పుడేమో బంధువులూ 'రేప్' చేస్తున్నారని..
రుక్సాపై షేక్తోపాటు అతడి బంధువులు సైతం లైంగికదాడికి పాల్పడ్డారు.
హైదరాబాద్: సౌదీ నుంచి పాతబస్తీలో అడుగుపెడుతున్న అరబ్ షేక్లు ఎంతోమంది అమాయక బాలికల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. డబ్బుకు కక్కుర్తిపడే ఖాజీలు పేద ముస్లిం కుటుంబాల యువతులను కాంట్రాక్టు పెళ్లిళ్లకు బలవంతం చేస్తున్నారు.
మేం సెక్స్ కోసం.. మీవాళ్లు డబ్బు కోసం: షేక్ చెప్పినట్లే?, పాతబస్తీలో ఖాజీ రఫియా లీలలు
నయానో.. భయానో.. వారి తల్లిదండ్రులను ప్రలోభ పెట్టి యువతుల్ని షేక్ ల వద్దకు చేరుస్తున్నారు. ఇటీవల పాతబస్తీలో పట్టుబడ్డ 10మంది షేక్ ల బాగోతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఫలక్నుమా బాలిక రుక్సా వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. సౌదీ షేక్ తో యువతికి బలవంతంగా నిఖా జరిపించి అక్కడికి పంపించగా.. షేక్ తో పాటు అతని బంధువులు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
అగస్టు 17న వెలుగులోకి:
పాతబస్తీలోని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాబ్సాబ్ కుంట ప్రాంతంలో గత నెల 17న రుక్సా ఉదంతం వెలుగులోకి వచ్చింది. అప్పటికే పలువురు పాతబస్తీ మైనర్ బాలికలను కాంట్రాక్టు పెళ్లిళ్లు చేసుకున్న ఒమన్కు చెందిన షేక్ అహ్మద్ అబ్దుల్లా అమూర్ అల్ రహ్బీ(61) మరో పెళ్లి కోసం పాతబస్తీలో అడుగపెట్టాడు. ఈసారి రుక్సా అతని చేతిలో బలైంది.
డబ్బు ఎరవేసి:
పాతబస్తీకి చెందిన బ్రోకర్లు అహ్మద్, సికిందర్ ఖాన్ (రుక్సా మేనమామ), గౌసున్నిసా బేగం (రుక్సా మేనత్త) సాయంతో రుక్సా తల్లిదండ్రులకు డబ్బు ఎరవేశాడు. అలా రుక్సా తల్లిదండ్రులు అంగీకరించడంతో మే 16న ఆ బాలికను వివాహం చేసుకున్నాడు.
ముందస్తు ఒప్పందం ప్రకారం బ్రోకర్లకు షేక్ రూ.8 లక్షలు చెల్లించాడు. అయితే బ్రోకర్లు మాత్రం బాలిక తల్లిదండ్రులకు డబ్బులివ్వలేదు. బాలిక తండ్రికి ఓ మోపెడ్, కూలర్ మాత్రమే కొనిచ్చి మిగిలిన మొత్తం ఖాజీలతో కలసి వీరు కాజేశారు. ఎర్రగుంటకు చెందిన ఖాజీ హబీబ్ అలీ వీరి నిఖా జరిపించాడు.
తప్పుడు పత్రాలతో:
పెళ్లి తర్వాత దాదాపు వారం రోజులు పాతబస్తీలోని ఓ లాడ్జీలో షేక్ మకాం వేశాడు. ఇక్కడే రుక్సాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై సౌదీ వెళ్లిన అతను బాలికను అక్కడికే రప్పించే ఏర్పాట్లు చేశాడు.
అయితే బాలిక మైనర్ కావడంతో వీసా ఇబ్బందులు తలెత్తాయి. ముంబైకి చెందిన చీఫ్ ఖాజీ ఫరీద్ అహ్మద్ ఖాన్, మరో ఖాజీ మునావర్ అలీ సహాయంతో నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించారు. వీటి ఆధారంగా రుక్సాకు వీసా సంపాదించి ఒమన్కు పంపించారు.
షేక్ బంధువుల నుంచి లైంగిక వేధింపులు:
రుక్సాపై షేక్తోపాటు అతడి బంధువులు సైతం లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని రుక్సా ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాలిక తల్లి సైదా ఉన్నీసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఫలక్నుమా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ట్విస్ట్.. మాట మార్చిన రుక్సా:
తనను వేధిస్తున్నారని, లైంగికంగా హింసిస్తున్నారని చెప్పిన రుక్సా పోలీసుల దర్యాప్తులో మాత్రం మాట మార్చింది. తనను షేక్ ఎలాంటి ఇబ్బందులకు గురి చేయట్లేదని, తాను అతడిని వదిలిరానని రుక్సా స్పష్టం చేసింది.
అయితే రుక్సా మైనర్ కావడం, షేక్తో జరిగిన వివాహం చట్టబద్దం కాకపోవడం వల్ల ఆమెను ఇక్కడికి రప్పించేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. రుక్సా వివాహం తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగినట్లు ఆధారాలుండడంతో వారిపైనా కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.