మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్-నవ వధువు మృతదేహాన్ని 2కి.మీ మోసుకుంటూ...
వికారాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ మానవత్వం చాటుకున్నారు. వాగులో గల్లంతైన నవ వధువు మృతదేహాన్ని స్థానికులతో కలిసి స్వయంగా 2కి.మీ భుజాలపై మోశారు. ఎస్పీ నారాయణతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్న ఆయన.. స్థానికుల సాయంతో మృతదేహాన్ని వాగు నుంచి ఒడ్డుకు చేర్చారు. నవ వధువుతో పాటు గల్లంతైన మరో మహిళ మృతదేహాన్ని కూడా వెలికి తీసి ఒడ్డుకు చేర్చారు.
జిల్లాలోని తిమ్మాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా... ఆదివారం(ఆగస్టు 29) అందులో ఓ కారు గల్లంతైన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో కారులో నవాజ్ రెడ్డి-ప్రవళిక అనే కొత్త జంటతో పాటు నవాజ్ రెడ్డి అక్కలు రాధ,శ్వేత,అల్లుడు శశాంక్ రెడ్డి,డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి ఉన్నారు. గల్లంతైన కారు నుంచి నవాజ్ రెడ్డి అతని అక్క రాధిక క్షేమంగా బయటపడగా... ప్రవళిక,శశాంక్ రెడ్డి,రాఘవేందర్ రెడ్డి,శ్వేత గల్లంతయ్యారు.

సోమవారం(ఆగస్టు 30) స్థానిక ఎస్పీ నారాయణతో కలిసి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గాలింపు చర్యలు చేపట్టారు. వాగులో కారు కొట్టుకుపోయిన ప్రాంతానికి దాదాపు 4కి.మీ కాలి నడకన వెళ్లారు.అక్కడ నవ వధువు ప్రవళికతో పాటు నవాజ్ రెడ్డి సోదరి శ్వేత మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సాయంతో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్,మరికొందరు మృతదేహాలను భుజాలపై మోస్తూ ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన శశాంక్ రెడ్డి,రాఘవేందర్ రెడ్డిల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ నెల 26న నవాజ్ రెడ్డి,ప్రవళికలకు వివాహం జరిగింది. వరుడి గ్రామం రావులపల్లి కాగా వధువు గ్రామం మోమిన్ పేట్. ఆదివారం మోమిన్ పేట్ నుంచి రావులపల్లికి కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలుదేరారు.మార్గమధ్యలో తిమ్మాపూర్ ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ... డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. వరద ఉధృతికి కారు వాగులో గల్లంతైంది. ఈ ఘటన పెళ్లింట తీవ్ర విషాదానికి దారితీసింది. పెళ్లయి నాలుగు రోజులు గడవకముందే నవ వధువు వాగులో కొట్టుకుపోవడంతో వధూవరుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. నిజానికి కారు వాగు సమీపంలోకి రాగానే స్థానికులు వారిని హెచ్చరించినట్లు చెబుతున్నారు. కారులో ఉన్న నవాజ్ రెడ్డి అక్కలు సైతం డ్రైవర్ను వారించగా... అతను దూకుడుగా కారును ముందుకు పోనిచ్చాడని అంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్-నవ వధువు మృతదేహాన్ని 2కి.మీ మోసుకుంటూ...#telangana, #vikarabad #MethukuAnand pic.twitter.com/8kZtlozpaR
— oneindiatelugu (@oneindiatelugu) August 30, 2021
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్-నవ వధువు మృతదేహాన్ని 2కి.మీ మోసుకుంటూ...#telangana, #vikarabad #MethukuAnand pic.twitter.com/n0NtpmilOJ
— oneindiatelugu (@oneindiatelugu) August 30, 2021












Click it and Unblock the Notifications