నయీంతో సంబంధాలు, సీఎం వ్యాఖ్యలపై యూ టర్నీ తీసుకున్న ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: 'నయీం నన్ను సీఎంగా చూడాలని నేను అనలేదు. కొన్ని పత్రికలు, మీడియా దీనిని సృష్టించాయి' అని బీసీ నేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. క్రిష్ణయ్య అన్నారు. మంగళవారం ఆయన ఓ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడారు.
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల హయాంలో నయీం గ్యాంగ్ స్టర్గా ఎదిగాడని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే పనిచేసిందని అన్నారు. నయీంను వాడుకుని వదిలేశారని ఆరోపించారు. గ్యాంగ్ స్టర్ నయీంతో చాలా మంది టీఆర్ఎస్ మంత్రులకు నేతలకు సంబంధం ఉందని ఆరోపించారు.
నయీం దందాలతో తనకు సంబంధం లేదని, దమ్ముంటే ఆధారాలు చూపాలని ఆయన డిమాండ్ చేశారు. 'కృష్ణయ్య నిప్పు. నిప్పును ముట్టుకుంటే కాలుతుంది. విద్యార్థులు, బీసీల సమస్యలపై పోరాడుతున్నాను. ఉద్యమాలు కేసీఆర్కు ఇబ్బంది కలిగిస్తున్నాయి' అని చెప్పారు.
'అందుకే నాపై ఆయన కక్ష కట్టారు. గతంలో అందరూ సీఎంలు ప్రజలకు అందుబాటులో ఉండేవారు. కేసీఆర్ అపాయింట్ మెంట్ నాకే కాదు, ఎవరికీ దొరకడం లేదు. నయీం బాధితులు నన్ను కలిసినప్పుడు, నేనే నయీంను బెదరించేవాడిని. నయీం వల్ల ఈదన్నతో పాటు నా అనుచరుల్లో కొందరిని కోల్పోయా. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి నయీంను ఎందుకు అరెస్ట్ చేయలేదు' అని ఆయన ప్రశ్నించారు.
కాగా, గత శుక్రవారం ఓ ప్రముఖ టీవీ ఛానెల్తో మాట్లాడిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గ్యాంగ్ స్టర్ నయీంతో తనకు సంబంధాలు ఉండేవని, అయితే అవి ఆర్థికపరమైనవి కావని, రాడికల్ యూనియన్లో పని చేసినప్పుడు సంబంధాలు ఉండేవని, తాను ముఖ్యమంత్రి కావాలని నయీం కోరుకునే వాడని అన్న సంగతి తెలిసిందే.
నయీంతో సంబంధాలున్నాయి, నేను సీఎం కావాలనుకున్నాడు, బెదిరించా!: ఆర్ కృష్ణయ్య సంచలనం
నయీం అరాచకాలు చేశారని, కాబట్టి ప్రభుత్వ చర్యను తాను సమర్థిస్తున్నానని చెప్పారు. అయితే దీని పైన సమగ్ర విచారణ జరపాలన్నారు. నయీం కేసులో తన పైన ప్రభుత్వం బురద జల్లుతుందని చెప్పారు. తనకు సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) నోటీసులు ఇస్తే తాను సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
తనకు నోటీసులు ఇస్తే కచ్చితంగా మాట్లాడుతానని చెప్పారు. సిట్ దర్యాఫ్తులో పారదర్శకత లేదని, దీనిని సీబీఐకి అప్పగించాలన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో తనను టార్గెట్ చేస్తున్నారన్నారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం నయీంతో కలిసినట్లుగా చెప్పడం సరికాదన్నారు.
తాను తన వాళ్ల కోసం పని చేస్తున్నానని, ముఖ్యమంత్రి పదవి కోసం కాదని అభిప్రాయపడ్డారు. ఎల్పీ నగర్లో పోటీ చేసిన సమయంలో తనకు నయీం డబ్బులు పెట్టారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. తనలాంటి నిజాయితీపరులైన వారిని టార్గెట్ చేయడం విడ్డూరమన్నారు.
నయీంతో తనకు ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నట్లు సిట్ నిరూపిస్తే తాను చట్టపరమైన శిక్షకు సిద్ధమన్నారు. తనకు మాత్రం ఆర్థికపరమైన సంబంధాలు లేవని చెప్పారు.