బ్రోకర్లకు శుభాకాంక్షలు: రైతులకు మేలు చేసే చట్టాలు వెనక్కి అంటూ రాజాసింగ్ సంచలనం
అమరావతి: వ్యవసాయ చట్టాలు రద్దు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ రైతు చట్టాలు రద్దు చేశారని.. ఈ సందర్భంగా బ్రోకర్లకు శుభాకాంక్షలు అంటూ రాజా సింగ్ వ్యాఖ్యానించారు. రైతులకు మేలు జరగాలనే ప్రధాని మోడీ ఈ చట్టాలు తీసుకొచ్చారని తెలిపారు.
పంట అమ్ముకుంటే రైతులకు లాభం రావాలి కానీ బ్రోకర్లకు కాదన్నారు. అందుకే ఈ వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చినట్లు స్పష్టం చేశారు రాజా సింగ్. అన్నదాతలు బ్రోకర్ల మాట నమ్మారని... నిరసనల వెనుక బ్రోకర్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. నిధులు వారే ఇచ్చారు... సారా ప్యాకేట్స్ ఇచ్చారు.. అంత మనము చూశామన్నారు.
ఈ క్రమంలోనే దేశ వాతావరణం పాడుచేస్తున్నారని ప్రధాని మోడీ గమనించారని వెల్లడించారు. రైతులే రాబోయే రోజుల్లో రైతు చట్టాలు కావాలని ప్రధాని మోడీ ని కోరుతారని, బ్రోకర్లకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు గోషాల్మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.
కాగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న సమయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుల ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం.. మూడు సాగు చట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా దేశ రైతులందరికీ క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. దేశ వ్యాప్తంగా రైతుల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను.. కొన్ని వర్గాల రైతుల నిరసనతో వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. ఇక రైతులు నిరసనలను విరమించుకోవాలని కోరారు.
ఇది ఇలావుండగా, రైతు చట్టాలను కేంద్రం వెనుకకు తీసుకోవడం సంతోషకరమని బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు వందలాదిరోజులు పోరాడరని ఆయన గుర్తు చేశారు. కేంద్రం మెడలు వంచిన అన్నదాతలకు ఆయన జేజేలు తెలిపారు. 'రైతు వ్యతిరేక చీకటి చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేంద్రం ప్రకటించడం సంతోషకరం. గత వందలాదిరోజులుగా ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన అన్నదాతలకు జేజేలు' అని ఆయన ట్వీట్ చేశారు.