ఏసీబీకి సండ్ర లేఖ, రేవంత్ను ఎదుర్కోలేక.. అసలు కేసీఆర్ ఎవరు: సోమిరెడ్డి
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తనకు నోటీసులు ఇచ్చిన ఏసీబీకి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం నాడు లేఖ రాశారు. ప్రస్తుతం తాను విచారణకు హాజరు కాలేనని, ఇప్పుడే కోలుకుంటున్నానని రాశారు.
మరో పది రోజుల పాటు తాను ప్రయాణాలు చేయవద్దని వైద్యులు సూచించారని పేర్కొన్నారు. అనారోగ్య కారణాల వల్ల తాను విచారణకు హాజరు కాలేకపోతున్నానని, ఆరోగ్యం బాగయ్యాక వస్తానని తెలిపారు. తనకు కాలు నొప్పి, వెన్ను నొప్పి ఉందని, విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పారు.
విచారణకు ఈ రోజు సాయంత్రంలోగా రావాలని మీడియా ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. తాను పర్యటనలో ఉండాగ వెన్ను, కుడికాలుకు తీవ్ర నొప్పి వచ్చిందన్నారు. వైద్యులను సంప్రదిస్తే పది రోజులు విశ్రాంతి తీసుకోమన్నారని తెలిపారు.
రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక: సోమిరెడ్డి
యువకుడైన రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక కేసీఆర్ అతనిని కుట్రపూరితంగా ఇరికించారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. విభజన చట్టంలోని సెక్షన్ 8 చెల్లదని చెప్పడానికి కేసీఆర్ ఎవరని ప్రశ్నించారు. విభజన చట్టం మిగిలిన సెక్షన్లకు వర్తించినప్పుడు సెక్షన్ 8కు ఎందుకు వర్తించదని ప్రశ్నించారు.
చట్టాలు ఎక్కడైనా ఒకేలా ఉంటాయని చెప్పారు. ఏసీబీ డీజీ ఏకే ఖాన్ పలుమార్లు గవర్నర్తో భేటీ కావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చట్టాల చెల్లుబాటు పైన ఒక్క కేసీఆరే కాక తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు సహా ఏ ఒక్కరికీ కూడా మాట్లాడే హక్కు లేదన్నారు.
ఉమ్మడి రాజధాని హైదరాబాదులో నివసించే ప్రజల అందరి రక్షణ బాధ్యత గవర్నర్దేనని చెప్పారు. సెక్షన్ 8 చెల్లదనేందుకు కేసీఆర్ ఎవరని ప్రశ్నించారు.
గవర్నర్ రాజకీయ నాయకుడు కాదని, ఆయన పైన తమకు కక్ష, కోపం లేదన్నారు. సెక్షన్ 8 పైన జోక్యం చేసుకోవాలని తాము కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. రేవంత్ రెడ్డి పైన పెట్టిన పీసీ యాక్ట్ నిబంధనలకు విరుద్ధమన్నారు. రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక తప్పుడు కేసులతో ఇరికించారన్నారు.