వరదముంపు ప్రాంతాల్లో రంగంలోకి ఎమ్మెల్యే సీతక్క.. ప్రభుత్వం బ్రతికుంటే ఆ పని చెయ్యాలన్న సీతక్క
గోదావరి నదికి వరద పోటెత్తడంతో గోదావరి పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం లో గోదావరి వరద ముంపు ప్రాంతాలలో పరిస్థితి దారుణంగా తయారైంది. మారుమూల గిరిజన ప్రాంతాలు గోదావరి వరద తో నీట మునగడంతో బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా తయారయ్యాయి. అధికారులు కూడా ఈ ప్రాంతాలను పట్టించుకోవటం లేదన్న ఆవేదన అక్కడ ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క వారి కోసం తానున్నానంటూ రంగంలోకి దిగారు.
వరద ముంపు గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే సీతక్క
జోరున కురుస్తున్న వానలోనూ, మోకాళ్ళ లోతు నీళ్లలో కాలినడకన వెళ్లి వరదలో చిక్కుకున్న గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలకు కావలసిన నిత్యావసరాలను అందిస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగానే కాకుండా, మానవత్వం ఉన్న నాయకురాలిగా ఆమె వరద సహాయాన్ని అందిస్తున్నారు. గతంలోనూ కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో, మారుమూల గిరిజన గ్రామాలలో ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాని పరిస్థితుల్లో ఎమ్మెల్యే సీతక్క ఇంటింటికి తిరిగి లాక్ డౌన్ సమయంలో వారికి కావలసిన సహాయాన్ని అందించారు.
వరద బాధితులకు నిత్యావసరాలు అందించిన ఎమ్మెల్యే సీతక్క
కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి, వారికి కావలసిన నిత్యావసర వస్తువులను అందజేశారు. మళ్లీ ఇప్పుడు సీతక్క వరద ముంపు ప్రాంతాలలో అదేవిధంగా యుద్ధప్రాతిపదికన పర్యటిస్తూ వరద ముంపు బాధితులకు సహాయాన్ని అందిస్తున్నారు. వర్షంలో తడుస్తూ కూడా సీతక్క సహాయక కార్యక్రమాలను కొనసాగించారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను గోడును అడిగి తెలుసుకున్నారు. సీతక్కకు తమ పరిస్థితిని చెబుతున్న బాధితులు ఆమెను పట్టుకొని కన్నీటిపర్యంతమయ్యారు.
వరదల ప్రభావాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క
కొన్ని చోట్ల బోటులో ప్రయాణం చేసి, అనారోగ్యం బారిన పడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వరద బాధితులకు కావలసిన బట్టలు, నిత్యావసర వస్తువులను అందించారు ఎమ్మెల్యే సీతక్క. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని తాను అండగా ఉంటానని సీతక్క పేర్కొన్నారు. వరదలకు కూలిపోయిన ఇళ్లను పరిశీలించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క, బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఇళ్ళు కోల్పోయిన వారికి శాశ్వత పునరావాసం కల్పించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సీతక్క.

ప్రభుత్వం బ్రతికుంటే వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకోవాలన్న సీతక్క
వరద ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ముంపుకు గురైన ప్రాంతాలలో సహాయక చర్యలు శూన్యంగా మారాయని నిప్పులు చెరిగారు. ఇవి గిరిజన గూడేలలో ప్రజల బ్రతుకులు అంటూ పేర్కొన్న సీతక్క, ప్రభుత్వం అనేది బ్రతికుంటే వరదల ద్వారా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రజలకు మాట ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. వరదల వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని సీతక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications