టిఆర్ఎస్, బిజెపి రాజకీయ యుద్ధంలో తన భర్త బలవుతున్నారు: హైకోర్టులో నందకుమార్ సతీమణి పిటీషన్!!
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతుంది. ఈ కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ భాగ్య చిత్ర లేఖ ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐతో కానీ లేక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తో కానీ విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టులో నందకుమార్ సతీమణి చిత్రలేఖ పిటీషన్
అక్టోబర్ 26 వ తేదీన మొయినాబాద్ లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో తన భర్త అయిన నంద కుమార్ తో పాటు మరో ఇద్దరిని అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారని నంద కుమార్ సతీమణి చిత్ర లేఖ పేర్కొన్నారు. ఆపై జరిగిన వరుస పరిణామాలను పేర్కొని ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
పిటీషన్ లో కేసుకు సంబంధించి కీలక విషయాలు
అరెస్ట్ అనంతరం అక్టోబర్ 27వ తేదీన నిందితులను రిమాండ్ పోలీసులు కూడా ఏసీబీ కోర్టు తిరస్కరించిందని పేర్కొన్న ఆమె 41ఏ కింద పోలీసులు నోటీసులు ఇవ్వకపోవడాన్ని ఏసీబీ కోర్టు తప్పు పట్టిందని, వారిని వెంటనే విడుదల చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది అని తెలిపారు. ఆ తర్వాత పరిణామాలలో భాగంగా పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు నిందితులు వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది అని, ఆ తర్వాత పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు తన పిటిషన్లో పేర్కొంది.
తన భర్తను ఇరికించే రాజకీయ కుట్ర
ఇక ఈ నేపథ్యంలో తన భర్త అయిన నందకుమార్ ఫోన్ ను ట్యాప్ చేసి వ్యక్తిగత సంభాషణలను రికార్డు చేసి, ఆ ఆడియో టేపులను బయటకు రిలీజ్ చేశారని నందకుమార్ సతీమణి చిత్రలేఖ పేర్కొన్నారు. ఇది టెలిగ్రాఫిక్ చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్న ఆమె, రాష్ట్ర అధికార పార్టీ నేరుగా ఈ కేసులో ప్రమేయం ఉన్న కారణంగా ఈ కేసులో రాష్ట్ర పోలీసు వ్యవస్థపై తమకు నమ్మకం లేదని, విచారణ సక్రమంగా సాగుతుంది అన్న భావన తమకు లేదని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. కేవలం ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా తన భర్తను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్న ఆమె, ఇది కొందరు ఒత్తిడితో పెట్టిన కేసు మాత్రమే అంటూ వెల్లడించారు.
సీబీఐ లేదా సిట్ తో విచారణ జరిపించండి
టిఆర్ఎస్, బిజెపి రాజకీయ యుద్ధంలో తన భర్త బలవుతున్నారని నందకుమార్ భార్య పిటిషన్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ కేసుపై సీబీఐతో కానీ, సిట్ తో కానీ దర్యాప్తు చేయించాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ సి పి, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్,కేంద్ర హోం శాఖ కార్యదర్శి, కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు.