అరుణ మాటల దాడి, ఓడితే ఏంకాదు: మంత్రి, 'కెసిఆర్ని అడ్డుకొని గెలిచిన కోమటిరెడ్డికి థ్యాంక్స్'
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆరింట రెండు స్థానాల్లో ఘన విజయం సాధించింది. దీనిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డికె అరుణ స్పందించారు. ఈ ఫలితాలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. పాలమూరులో అధికార పార్టీ భంగపడిందన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. టిఆర్ఎస్ అధికార దుర్వినియోగాన్ని తట్టుకొని గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డిలకు ధన్యవాదాలు అన్నారు.
అంతకుముందు నల్గొండ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. తమ గెలుపు అధికార టిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం అన్నారు.
రెండు స్థానాల్లో ఓడినంత మాత్రాన నష్టం లేదు: మహేందర్ రెడ్డి
తాము రెండు స్థానాల్లో ఓడిపోయినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో బలం లేకున్నా టిడిపి, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేశాయన్నారు. తమకు బలం ఉంది కాబట్టే రంగారెడ్డి జిల్లాలో రెండు సీట్లు గెలుచుకున్నామని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లోను ఇదే ఫలితం వస్తుందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తమ విజయాన్ని ఆపలేకపోయారన్నారు.
కాంగ్రెస్ పార్టీలో గ్రేటర్ పంపకం!
కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బాధ్యతలపైన రగడ కొనసాగుతోంది. ఇటీవల ఈ అంశం ఉప్పల్లో దానం నాగేందర్ పైన దాడి యత్నానికి కూడా దారి తీసింది. హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాలను గ్రేటర్గా భావించి, దానం నాగేందర్ను అధ్యక్షుడిగా నియమించాలని ఓ వర్గం చెబుతోంది.
రంగారెడ్డి జిల్లా నాయకులు మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను వేర్వేరుగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం బుధవారం పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్దకు వెళ్లింది. ఈ సందర్భంగా ఈ వివాదం కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులోని 76 డివిజన్ల బాధ్యతను దానంకు, రంగారెడ్డి జిల్లాలోని 64 డివిజన్ల బాధ్యతను రంగారెడ్డి జిల్లా నేతలకు అప్పగించారు.