2019లో కాంగ్రెసేనా?: పదింట గెలిచినా కెసిఆర్కు చేదు, టిడిపి-బిజెపి ఔట్!
హైదరాబాద్: తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ దూసుకెళ్లింది. కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది. అదే సమయంలో మిత్రపక్షాలైన తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు గట్టి షాకిచ్చాయి.
ఇప్పటికే వరంగల్ ఉప ఎన్నికల ఫలితాల నుంచి విపక్షాలు కోలుకోవడం లేదు. వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్, రెండోస్థానంపై బిజెపి - టిడిపిలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ కాంగ్రెస్ రెండో స్థానంలో, బిజెపి మూడో స్థానానికి పడిపోయింది.
ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది. బిజెపి - టిడిపిలకు మాత్రం కోలుకోలేని దెబ్బ తగిలింది.
12 స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. ఎన్నికలకు ముందే ఆరు చోట్ల టిఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. కాంగ్రెస్, టిడిపిల తరఫున నిలబడిన అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల పోటీ నుంచి విరమించుకొని మరీ, తెరాస తీర్థం పుచ్చుకున్నారు.
దీంతో, ఆరు స్థానాలను ఎన్నికలకు ముందే తెరాస కైవసం చేసుకుంది. కెసిఆర్ అభివృద్ధి పనులు చూసే వారు విరమించుకున్నారని టిఆర్ఎస్ చెప్పగా, సంతలో పశువుల్లో కొని ఏకగ్రీవం చేసుకున్నారని టిడిపి, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి.
మిగతా ఆరు స్థానాలకు మూడు రోజుల క్రితం ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాల్లో టిఆర్ఎస్ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ రెండుస్థానాల్లో విజయం సాధించి కెసిఆర్కు షాకిచ్చింది.
మొత్తం 12 స్థానాలు తామే గెలుస్తామని టిఆర్ఎస్ భావించింది. అయితే, అనూహ్యంగా నల్గొండలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్ నగర్లో మరో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో టిఆర్ఎస్ నాలుగు విజయాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అంతకుముందు ఏకగ్రీవమైన ఆరు, తాజాగా గెలిచిన నాలుగు స్థానాలతో కలిపి.. టిఆర్ఎస్ మొత్తం పది ఎమ్మెల్సీ సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఈ ఫలితాలు తెరాస ఆత్మవిమర్శ చేసుకునే విధంగా ఉన్నాయని విపక్షాలు అంటున్నాయి. ఇన్నాళ్లు ఎదురు గాలి వీచిన కాంగ్రెస్ పార్టీకి.. రెండు స్థానాల్లో గెలుపుతో ఊరట లభించింది.
ఫలితాలు
ఖమ్మంలో 31 ఓట్ల ఆధిక్యంతో తెరాస అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ విజయం సాధించారు. మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 65 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
నారాయణ రెడ్డికి 445, కాంగ్రెస్ అభ్యర్థికి 380 ఓట్లు పోలయ్యాయి. మరో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి విజయం సాధించారు. టిడిపి నేత కొత్తకోట దయాకర్ రెడ్డి ఓటమి చవి చూశారు.
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. రాజగోపాల్ రెడ్డికి 642 ఓట్లు రాగా, తెరాస అభ్యర్థి తేరా చిన్నప రెడ్డికి 449 ఓట్లు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు తెరాస ఖాతాలో చేరాయి. తెరాస అభ్యర్థులుగా బరిలో దిగిన నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు గెలుపొందారు.
తన గెలుపుపై రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికలో ధర్మమే గెలిచిందన్నారు. అధికార పార్టీ ఎన్నిక కుట్రలు, కుతంత్రాలు చేసినా చివరికి కాంగ్రెసే గెలిచిందన్నారు. ఈ విజయం తెరాసకు గుణపాఠం అవుతుందన్నారు. ఈ విజయాన్ని సోనియాకు బహుమతిగా ఇవ్వాలనుకున్నామన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు.