టీఆర్ఎస్కు 'పోట్ల' పోటు?: కాంగ్రెస్లో చేరేందుకు సిద్దం.., రేవంత్ వైపే..
అధికార పార్టీని వీడి పోట్ల కాంగ్రెస్ లోకి వెళ్లడం టీఆర్ఎస్ కు పెద్ద ఝలక్ అనే చెప్పాలి. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది.
ఖమ్మం: తెలంగాణ సీఎం కేసీఆర్పై పోరుకు కాంగ్రెస్ పార్టీయే సరైన వేదిక అని భావిస్తున్న రేవంత్ రెడ్డి.. మంగళవారం పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ వెంట ఇప్పటికే దాదాపు 25మంది కీలక నేతలు టీడీపీని వీడుతుండగా.. చాలా జిల్లాల్లో నేతలు ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
రేవంత్ కాంగ్రెస్ గూటికి చేరుతున్న వేళ.. ఇటు అధికార పార్టీలోని అసంతృప్తి నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తుండటం గమనార్హం. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ గూటిలోకి చేరడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీలో కలకలం మొదలైంది.
గుర్తింపు లేదనే:
పార్టీలో సరైన గుర్తింపు దక్కట్లేదని టీఆర్ఎస్ పై కొంతకాలంగా పోట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2009లో స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన పోట్ల 2015 వరకు టీడీపీలో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ గూటికి చేరడంతో జిల్లాలో రాజకీయం మారిపోయింది. నామా వర్గానికి చెందిన పోట్ల కూడా గులాబీ గూటికి చేరారు. అయితే పార్టీలో చేరినప్పుడు తనకు లభించిన హామిలేవి అమలుకాకపోవడంతో పార్టీలో కొనసాగడంపై ఆయన పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.
రేవంత్, రేణుకా చౌదరిలతో భేటీ:
ఆదివారం రేవంత్రెడ్డిని కలిసిన పోట్ల నాగేశ్వరరావు ఆయనతో జిల్లా రాజకీయ అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. తన వెంట వచ్చే నేతల జాబితాలో పోట్ల పేరును కూడా చేర్చాలని రేవంత్ భావించినప్పటికీ.. ఆయన నుంచి స్పష్టమైన హామి ఏమి లేకపోవడంతో అది సాధ్యపడలేదు. రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత పోట్ల నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని కలిశారు. ఆమెతో చర్చల అనంతరం కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఆయన తీర్మానించుకున్నట్టు తెలుస్తోంది.
హస్తంలో రేవంత్ హవా: రాహుల్తో లంచ్.. సోనియానూ కలిసేందుకు!, ఇదీ షెడ్యూల్
టీఆర్ఎస్కు ఝలక్:
అధికార పార్టీని వీడి పోట్ల కాంగ్రెస్ లోకి వెళ్లడం టీఆర్ఎస్ కు పెద్ద ఝలక్ అనే చెప్పాలి. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. వెంటనే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మె ల్యే పువ్వాడ అజయ్కుమా ర్ పోట్లను రంగంలోకి దించడంతో.. బుజ్జగింపుల పర్వం నడించింది. పార్టీ తనను పట్టించుకోవడం లేదని, అందువల్లే తాను పార్టీ మారుతున్నానని పోట్ల వాపోతున్నట్టు సమాచారం.
రేపో మాపో..
రేపో మాపో పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో తన అనుచరులతో చర్చించి వారి అభీష్టం మేరకు పార్టీ మార్పు అంశంపై ఆయన తుది నిర్ణయం తీసుకునే అవకాముంది. ఈనెల 9న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ మహబూబాబాద్లో జరిగే గిరిజన సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది. ఈలోగా తాను కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని పోట్ల భావిస్తున్నట్టు సమాచారం.
వాళ్లు టీఆర్ఎస్ లోకి వెళ్లే ఛాన్స్:
కల్లూరుకు చెందిన వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ యాదయ్య, తల్లాడకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఒకరు, ఖమ్మంకు చెందిన టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు వంటి ద్వితీయ శ్రేణి నాయకులు గులాబీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరితే పార్టీ పరంగా జిల్లాస్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు పోట్ల అనుచరులు భావిస్తున్నారు.