ఖబడ్దార్: రౌడీషీటర్లకు మావోయిస్టుల హెచ్చరిక
శ్రామిక వర్గాలు, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న రౌడీషీటర్లరా.. ఖబడ్దార్! అంటూ కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేరుతో ఉత్తరాన్ని సోమవారం విడుదల చేశారు.
వరంగల్: వరంగల్ గ్రేటర్ పరిధిలోని శ్రామిక వర్గాలు, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న రౌడీషీటర్లరా.. ఖబడ్దార్! అంటూ కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేరుతో ఉత్తరాన్ని సోమవారం పత్రిక కార్యాలయాలకు విడుదల చేశారు. లేఖలోని వివరాలు ఇలా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో భూ మాఫియా నడిపిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
నెత్తుటి త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ రాజకీయ నాయకుల అండదండలతో రౌడీయిజం చేస్తూ ప్రజలను భయాభ్రాంతులకు గురి చేస్తే పార్టీ చేతుల్లొ శిక్ష తప్పదని హెచ్చరించారు. గ్రేటర్ పరిధిలోని రౌడీయిజం చేస్తున్న వారిలో ఇరవై మంది పేర్లు ప్రస్తావించి.. వీరిలో ఎవరినీ విడిచిపెట్టమన్నారు. వరంగల్ పట్టణంలో రౌడీలను అణచివేసిన చరిత్ర మావోయిస్టు పార్టీకి ఉందన్నారు.
ప్రజలరా.. పార్టీ అందించిన స్ఫూర్తితో రౌడీయిజం చేస్తున్న వారిని తరమివేయాలన్నారు. గూండాయిజం చేస్తే ప్రజల చేతులో శిక్ష తప్పదని హెచ్చరించారు. టిఆర్ఎస్ రౌడీలకు అడ్డాగా మారిందన్నారు. టిఆర్ఎస్ కార్పొరేటర్లు ఇద్దరు అధికారం అడ్డుపెట్టుకొని గూండాయిజం చేస్తే ప్రజల చేతిలో శిక్షకు గురవుతారన్నారు.
జగిత్యాల రైతాంగ పోరాటం స్ఫూర్తితో ధర్మసాగర్, వేలేరు, నారాయణగిరి, పీచర, భట్టుపల్లి, దేవన్నపేట, టేకులగూడెం భూస్వామ్యం నుంచి సాధించుకున్న భూములపై మళ్లీ దొరల కన్ను పడిందన్నారు. టేకులగూడెంలో పార్టీ చేతుల్లో శిక్షకు గురైన వారు వ్యాపారం పేరుతో దళితుల నుంచి లాక్కొన్న భూములను వెంటనే దళితులకు ఇవ్వాలని పేర్కొన్నారు.
పద్ధతి మార్చుకోకపోతే ప్రజల చేతుల్లో శిక్ష తప్పదని హెచ్చరించారు. వీరికి అండగా ఉంటున్న నకిలీ నక్సల్స్ ముఠా సభ్యుడు ధర్మాపురానికి చెందిన వ్యక్తి పార్టీ పేరుతో దందాలు చేస్తే శిక్ష తప్పదన్నారు. ధర్మసాగర్ మండలంలో ముగ్గురు వ్యక్తులు ప్రభుత్వ పథకం ఆశ చూపి మహిళలు, వృద్ధుల నుంచి డబ్బులు వసూళ్లు చేసినవి తిరిగి ఇవ్వాలని తెలిపారు.