నైరుతి రుతుపవనాల ఎంట్రీ: కేరళతోపాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
హైదరాబాద్: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సరైన సమయంలోనే అంటే భారత వాతావరణ శాఖ చెప్పిన జూన్ 1నే కేరళ తీరాన్ని తాకాయి. ప్రస్తుతం కేరళ తీరంలో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. సుమారు ఐదురోజులపాటు వరుసగా రాష్ట్రమంతటా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో తీర ప్రాంతాలను ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్య్సకారులను వేటకు వెళ్లవద్దని సూచించారు.

ఇప్పటికే తెలంగాణలో వర్షాలు..
మరికొద్ది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు కూడా నైరుతి రుతుపవనాలు రానున్నాయి. అయితే, తెలంగాణలో ఇప్పటిక వర్షాలు పడుతున్నాయి. ఛత్తీస్గఢ్ పరిసరాల్లో 2.1 కిలోమీటర్ల మేర ఉపరితల ఆవర్తనం ఉంది. అంతేగాక, ఛత్తీస్ గఢ్ నుంచి లక్షదీపుల వరకు రాయలసీమ, కర్ణాటక, కేరళపై ఉపరితల ద్రోణి ఉంది. ఇక అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం బలపడుతోంది. ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది. దీంతో మూడ్రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది .

దేశ వ్యాప్తంగా నాలుగు నెలలపాటు..
ఈ ఏడాది రుతుపవనాలు బలంగా ఉండటంతో దేశ వ్యాప్తంగా నాలుగు నెలలపాటు సాధారణ వర్షపాతం నమోదు కానుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్-సెప్టెంబర్ వరకు 75శాతానికిపైగా వర్షం పడుతుందని తెలిపింది.
కాగా, సోమవారం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు కొద్ది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు వస్తుండటంతో ఇక్కడ కూడా వర్షం కురిసే అవకాశం ఉంది.

ఏపీని రుతుపవనాలు తాకడంతో..
ఇది ఇలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా నైరుతి రుతుపవనాలు సోమవారమే తాకాయని విజయవాడ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అరేబియా సముద్రం, లక్ష ద్వీప్ దీవులు, మాల్దీవులు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ లోని కొన్ని ప్రాంతాలు, కోమోరిన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది. దీంతో రాబోయే మూడు రోజులపాటు ఏపీలో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది.
ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.












Click it and Unblock the Notifications