మూసీ ప్రక్షాళన, బుల్డోజర్ ఎవరు ఆపినా ఆగవు: తేల్చేసిన రేవంత్ రెడ్డి
మూసీ ప్రక్షాళనకు కొంత మంది దుర్మార్గులు అడ్డొస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు అడ్డు వచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదని తేల్చి చెప్పారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ యాత్రకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం శ్రీకారం చుట్టారు. సంగెం నుంచి నాగిరెడ్డిపల్లె వరకు ధర్మారెడ్డి కాల్వ వెంబడి సుమారు 2.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అంతకుముందు సంగెం మూసీ నది ఒడ్డునున్న భీమలింగం వద్ద సీఎం పూజలు చేశారు.
సంగెం గ్రామస్తులు మూసీ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. మూసీ ప్రక్షాళనకు అడ్డుపడేవారిలో బీఆర్ఎస్ ముందుందని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ఉత్పత్తులను ఎవరూ కొనట్లేదని, ఆ ప్రాంతంలో కల్లు అమ్ముకునే పరిస్థితి కూడా లేదన్నారు సీఎం రేవంత్. మూసీ నదిలో చేపలు బతుకుతున్నాయా? అని ప్రశ్నించారు.

మూసీ నది ఒడ్డున పెంచిన గొర్రెలను ఎవరూ కొనడం లేదన్నారు. మూసీ నది కలుషితం కావడంతో వ్యవసాయం చేయడం లేదన్నారు. మూసీ కాలుష్యం కారణంగా పట్టణాలు, గ్రామాలు నాశనమవుతున్నాయని సీఎం రేవంత్ తెలిపారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ నేతలు రూ. లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల మాదిరిగా గారడీ చేయడం తమకు రాదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
మూసీ ప్రక్షాళన, బుల్డోజర్కు ఎవరు అడ్డొచ్చినా లెక్క చేయమని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిశ్చయించుకున్నామన్నారు. మరో 30 రోజుల్లో తుదిరూపం తీసుకొస్తామన్నారు. వచ్చే జనవరి తొలివారం నుంచి పాదయాత్ర చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ ఆధ్యాత్మిక వైభవ కేంద్రం…
— Revanth Reddy (@revanth_anumula) November 8, 2024
యాదగిరి గుట్ట లక్ష్మీ నారసింహుడి క్షేత్రం…
పుట్టిన రోజు పర్వదినాన…
పవిత్ర హృదయంతో…
ఆ దేవదేవుడి సన్నిధి లో… pic.twitter.com/iB0z2yEdZj
మూసీ పునరుజ్జీవన యాత్రలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొన్నారు. సంకల్పయాత్రలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి వెంట పాదయాత్ర చేశారు.

టీటీడీ తరహాలో యాదగిరి టెంపుల్ బోర్డు
అంతకముందు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్పుతోపాటు యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీటీడీ తరహాలో యాదగిరి టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications