అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ టోనీ అరెస్ట్: ముంబైలో పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు, కీలక విషయాలు
హైదరాబాద్: దేశంలో అక్రమంగా నివసిస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశాలోని సంపన్నులకు కొకైన్, డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ డేవిడ్ అలియాస్ టోనీని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ముంబై కేంద్రంగా నాలుగేళ్లుగా డ్రగ్స్ రాకెట్ ను నిర్వహిస్తున్న అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
టోనీని ముంబైలో పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
టోనీ నుంచి ఓ కారు, సెల్ ఫోన్ తోపాటు 10 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు, అతడ్ని జైలుకు తరలించినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గురువారం ఓఎస్డీ రాధాకిషన్ రావుతో కలిసి ఆయన టోనీ అరెస్ట్ వివరాలను వెల్లడించారు. నార్త్ జోన్ పోలీసులు పది రోజులుగా ముంబైలో మకాం వేశారని, అక్కడి పోలీసుల సహకారంతో నిందితుడు టోనీని అరెస్ట్ చేశారని సీపీ తెలిపారు. టోనీ ఇచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్లో తొమ్మిది మంది డ్రగ్స్ వినియోగదారులను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఉంటున్న స్టార్ బాయ్ అనే వ్యక్తి నుంచి నౌకల ద్వారా డ్రగ్స్ టోనీకి చేరుతోందని వివరించారు.
వస్త్ర వ్యాపారమంట వచ్చి.. డ్రగ్స్ దందా.. వీసా గడువు ముగిసినా..
నైజీరియాకు చెందిన టోనీ అలియాస్ మార్షా(37) 2013లో తాత్కాలిక వీసాపై ముంబై వచ్చాడు. వస్త్ర వ్యాపారం పేరుతో ముంబై చేరుకున్న టోనీ.. తూర్పు అధేరిలో ఓ చిన్న గదిలో నివసిస్తూ.. అక్కడేవున్న నైజీరియన్టలతో పరిచయం పెంచుకున్నాడు. లోదుస్తులు కొని నైజీరియాకు ఎగుమతి చేసేవాడు. ఆ తర్వాత మీరా భాండియారా, వాసైవిరార్ ప్రాంతాల్లోని నైజీరియన్ల వద్దకు వెళ్లాడు. వారిలో కొంతమంది డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుండటంతో తానూ అదేబాటలో నడిచాడు. 2017 నుంచి సొంతంగా డ్రగ్స్ తెప్పించుకోవడం, నలుగురు ఏజెంట్లను నియమించుకోవడం, వారి ద్వారా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, వైజాగ్ ప్రాంతాలకు కొకైన్ సరఫరా చేయడం మొదలుపెట్టాడు.
ఏపీ, తెలంగాణతోపాటు టోనీకి ఢిల్లీ, గోవాలోనూ ఏజెంట్లు, కోట్లలో వ్యాపారం
వీసాతోపాటు పాస్పోర్ట్ కాలపరిమితి ముగిసినా అంథేరీ ఈస్ట్లో అక్రమంగా నివసిస్తున్నాడు. ఇక ముంబైలోనే నైజీరియన్ యువతి లోవత్ యూసుఫ్ తో టోనీ సహజీవనం చేస్తున్నాడు. తన ఏజెంట్లు ఇమ్రాన్ బాబూ షేక్, నూర్ మహమ్మద్ ఖాన్ ల ద్వారా హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఆఫ్రికా నుంచి గ్రాము కొకైన్ రూజ 3వేలకు తెప్పించి, రూ. 7 వేల నుంచి రూ. 10 వరకూ విక్రయిస్తున్నాడు. సోషల్ మీడియా, నైజీరియా ఫోన్ నంబర్ ద్వారా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) కాల్స్తో అనుచరులను సంప్రదిస్తూ డ్రగ్స్ దందా సాగించేవాడు. అతనికి తెలంగాణ, ఏపీతోపాటు గోవా, ఢిల్లీల్లోనూ అనుచరులు ఉన్నారు. వారి సహకారంతో ఆయా ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. లావాదేవీలన్నీ బిట్ కాయిన్స్ రూపంలోనూ జరుపుతున్నాడు. రూ. కోట్లలో కొకైన్ వ్యాపారం నిర్వహిస్తున్నా.. టోనీ బయటపడకుండా జాగ్రత్తపడ్డాడు. తన ఏజెంట్లు ఇమ్రాన్ బాబూ షేక్, నూర్ మహ్మద్ ఖాన్, అల్తాఫ్, పర్వేజ్, రహమత్, ఇర్ఫాన్, ఫిర్దోస్లకు నాలుగేళ్లలో ఒక్కసారి కూడా కనిపించకపోవడం గమనార్హం. డ్రగ్స్ విక్రయించినందుకు వారికి రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు కమీషన్ ఇచ్చేవాడు టోనీ. వారితో ఎప్పుడూ ఇంటర్నెట్ ఫోన్లోనే మాట్లాడేవాడు.
Recommended Video
టోనీని అరెస్ట్ చేశారిలా.. ఎవరినీ వదలిపెట్టమంటూ సీవీ ఆనంద్
హైదరాబాద్ పోలీసులు కొద్ది రోజుల క్రితం ఇమ్రాన్, బాబూ షేక్, నూర్ మహమ్మద్ లను అరెస్ట్ చేశారు. దీంతో అతడి ఫోన్లలో సంభాషణలను తీసేశాడు. ఈ క్రమంలో టాస్క్ఫోర్స్ పోలీసులు ఇంటర్నెట్ ఫోన్ నెట్వర్క్ సంస్థలను సంప్రదించి టోనీ కదలికలను తెలుసుకుని పట్టుకున్నారు. టోనీని పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు అతని సెల్ఫోన్ను విశ్లేషించి 13 మంది డ్రగ్స్ వినియోగదారుల వివరాలను సేకరించారు. వారిలో నిరంజన్ కుమార్ జైన్, శాశ్వత్ జైన్, యోగానంద్ అగర్వాల్, బండి భార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినేడి సాగర్లను పట్టుకున్నారు. వారంతా సంపన్నుల బిడ్డలే కావడం గమనార్హం. ఒక్కొక్కరి ఆస్తి రూ. 100 కోట్ల నుంచి రూ. 1,000 కోట్ల వరకు ఉంటుందని సీవీ ఆనంద్ వెల్లడించారు. టోనీకి నైజీరియాలో ఉంటున్న స్టార్ బోయ్ అనే వ్యక్తి ఓడల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని పూర్తి వివరాలు టోనీకి కూడా తెలియవని చెప్పారు. డ్రగ్స్ కొనుగోలు కోసం వెంకట్ చలసాని, నిరంజన్ జైన్ తమ కార్యాలయాల్లో ఆఫీస్ బాయ్స్గా పనిచేస్తున్న అల్గాని శ్రీకాంత్, గోడి సుబ్బారావుల ఫోన్లు వాడారు. అయితే ఈ విషయం తెలిసినా తమ ఫోన్లు ఇచ్చి సహకరించినందుకు ఆ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, డ్రగ్స్ వినియోగదారుల్లో సినీ ప్రముఖులు ఉన్నట్లు తేలినా ఈసారి వదిలేది లేదని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు.