చిన్నారి కిడ్నాప్ డ్రామా: కన్నతల్లే నిందితురాలు
హైదరాబాద్: సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్లో బాలుడి కిడ్నాప్ వ్యవహారం అంతా నాటకమేనని తేలింది. నెలన్నర కొడుకును కన్న తల్లే అమ్ముకుందని మారేడ్పల్లి పోలీసులు తేల్చేశారు. సోమవారం రాత్రి నార్త్ జోన్ డీసీపీ సుధీర్బాబు తన కార్యాలయంలో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
కరీంనగర్ జిల్లా గణేష్నగర్ ప్రాంతానికి బుర్ర రజితకు ముగ్గురు మగపిల్లలు. వీరిలో పెద్ద కుమారుడి పేరు అరుణ్(3) , నెలన్నర క్రితం ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. కొంతకాలంగా రజిత తల్లి విజయ(50) వద్దనే ఉంటోంది. 7న రజిత తన ముగ్గురు పిల్లలు, తల్లితో కలిసి నగరంలోని హబ్సిగూడలోని ఓ కార్యాలయానికి వచ్చింది.
పనులు ముగించుకున్న అనంతరం రాత్రి 7 గంటల సమయంలో తన తల్లి, ముగ్గురు పిల్లలతో కలిసి కరీంనగర్ వెళ్లేందుకు జూబ్లీ బస్టాండ్కు వచ్చింది. పెద్ద కొడుకు అరుణ్ అడుకుంటూ దూరం పరుగెత్తడంతో అతన్ని తీసుకువచ్చేందుకు వెళ్తూ.. ఒక కుమారుడిని తన వెంట పెట్టుకొని .. మరొకరని పక్కనే ఉన్న గుర్తుతెలియని మహిళకు అప్పగించినట్లు రజిత పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విధితమే.
రజిత ఫిర్యాదు మేరకు మారేడ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. బాధితురాలు రజితను పలుమార్లు ప్రశ్నించిన పోలీసులకు ఆమెపైనే అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే జూబ్లి బస్టాండ్, కరీంనగర్ బస్టాండ్లలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కరీంనగర్లో బస్సెక్కెటప్పుడు రజిత వద్ద ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నట్లు బయట పడింది. దీంతో బాబు కిడ్నాప్ తల్లి రజిత అడిన నాటకమని పోలీసులు గుర్తించారు. విచారణ ప్రారంభించారు.
రజిత తన నెలన్నర బాబును విక్రయించేందుకు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్కు చెందిన జంగం లక్ష్మి, రేగొండ గ్రామానికి చెందిన భాగ్యమ్మలను అశ్రయించింది. వారి ద్వారా నాచారంలో నివాసం ఉంటూ.. సోని ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేస్తున్న వరంగల్ జిల్లా గోవిందరావుపేటకు చెందిన ఎం. భుజంగరావుకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 20 రోజుల క్రితమే భుజంగరావు వద్ద నుంచి బాబును విక్రయించినందుకుగాను రూ.1.32 లక్షలు తీసుకుంది.
కరీంనగర్ జిల్లా మంథనిలో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో బాబును భుజంగరావుకు మధ్యవర్తులైన లక్ష్మి, భాగ్యమ్మ అప్పగించారు. సోమవారం పోలీసులు కిడ్నాప్కు గురైన నెలన్నర బాబు ఆచూకీని కనుగొన్నారు. నాచారంలోని భుజంగరావు దంపతుల వద్ద ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి బాబును తీసుకున్నారు. భుజంగరావు, అతని భార్య విజయలక్ష్మిలను ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకొని కేసు మిస్టరీని ఛేదిస్తామని డిసిపి సుధీర్బాబు వెల్లడించారు. ప్రస్తుతం రజిత, ఆమె తల్లి విజయ, మధ్యవర్తులు లక్ష్మి, భాగ్యమ్మలు పరారీలో ఉన్నారు.