పవన్ని బయటపడేశావ్, ద్రోహి, జూ.ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణదాకా తిరుగుతున్నారు: బాబుపై మోత్కుపల్లి సంచలనం
హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గురువారం రాత్రి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు తన సంపాదన అంతటినీ విదేశాల్లో దాస్తున్నారని ఆరోపించారు. దుబాయ్, సింగపూర్, అమెరికాలో దాస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సంపాదించిన ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలని, ఒకవేళ దొరికినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవచ్చునని, దమ్మూధైర్యం ఉంటే ఆ స్టేలన్నింటినీ వెకేట్ చేయించుకోవాలన్నారు.
చంద్రబాబు విచారణకు ముందుకు రావాలన్నారు. సీబీఐ విచారణ జరిపితే కచ్చితంగా ఎంత సంపాదించారో బయటకు వస్తుందన్నారు. రాజ్యసభ సీట్లను అమ్ముకుంటావా, రాజ్యసభ సీటు ఇస్తానని నువ్వు నాకు ప్రామిస్ చేయలేదా? ఈ సీటును టీజీ వెంకటేష్కు వంద కోట్లకు నువ్వు అమ్ముకోలేదా? సీఎం రమేష్ దగ్గర నువ్వు తీసుకున్నావా? లేదా? గరికపాటి మోహన్ రావుకు నువ్వు డబ్బులు తీసుకోకుండా ఇచ్చావా? అని ఏకిపారేశారు.
రాజ్యసభ సీట్లు అమ్ముకున్నావు
నేను రాజ్యసభకు ఎంపికైన టీడీపీ నేతలను తప్పుబట్టడం లేదని, కానీ చంద్రబాబు వేలం వేశారని, వాళ్లు కొన్నారని మోత్కుపల్లి అన్నారు. వేలం వేస్తామని బోర్డు పెడితే కొనుక్కోకుండా ఎవరుంటారన్నారు. తప్పు ఇక్కడ లీడర్దే అన్నారు. రాజ్యసభలో ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ఉండకూడదా అని ధ్వజమెత్తారు. టీజీ వెంకటేష్, సీఎం రమేష్లకు సీట్లు అమ్ముకున్నావన్నారు. లోకేష్ రాజకీయ వ్యాపారం పెట్టారని ఆరోపించారు. రాజకీయాలను వ్యాపారం చేసిన ఘనత ఒక్క చంద్రబాబుదే అన్నారు.
జూ.ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ దాకా.. నీ ఇంటి చుట్టు తిరుగుతున్నారు
చంద్రబాబు చేసే రాజకీయ వ్యాపారాన్ని ఓ దళితుడిగా ఖండిస్తున్నానని మోత్కుపల్లి అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరావు, నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ముఖ్యమంత్రి కావాల్సిన బాలకృష్ణను చంద్రబాబు మోసం చేశారన్నారు. నందమూరి కుటుంబంలో ఎవరికి నువ్వు న్యాయం చేశావో చెప్పాలన్నారు. వాళ్లందరూ నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారన్నారు. నీ కొడుకు, ఆ తర్వాత మనవడికి రాజ్యాధికారం కావాలని కోరుకోవడం ఎంత వరకు సమంజసమన్నారు.
నందమూరి కుటుంబానికి ఇస్తే నేను సిద్ధం
నందమూరి కుటుంబం కోసం ఏదైనా చేస్తామని, ఇప్పటికైనా సరే, నందమూరి కుటుంబంలో ఎవరైనా ఈ జెండా మాది అని ముందుకొస్తే వాళ్ల వెంబడే తిరుగుతానని మోత్కుపల్లి అన్నారు. చదువుకున్న వాళ్లకు ఎన్టీఆర్ టిక్కెట్ ఇచ్చారని, చంద్రబాబు డబ్బున్నవాళ్లకు టిక్కెట్ ఇస్తున్నారన్నారు. పేదోడికి ఎన్టీఆర్ టిక్కెట్ ఇచ్చాడని, చంద్రబాబు ఘోరమైన పాపాలు చేసిన వాళ్లకి ఇస్తున్నారన్నారు. చంద్రబాబును వ్యతిరేకించే పార్టీలు ఏకం కావాలన్నారు. 2019లో చంద్రబాబుకు ప్రజలు తగినబుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడుతున్న తనకు అందరు మద్దతివ్వాలన్నారు. ఇంకా చెప్పాలంటే నాకు సహకారం కంటే అతనిని ఓడించడం ముఖ్యమన్నారు. నన్ను సస్పెండ్ చేసిన రోజే చంద్రబాబు పతనం ప్రారంభమైందన్నారు. అన్ని పార్టీల వాళ్లను కలుస్తానని చెప్పారు.
జగన్కు నా మద్దతు, పవన్తో కలుస్తా
జగన్ కుటుంబంలో ఆన మేనత్తలు నలుగురు దళితులను పెళ్లి చేసుకున్నారని మోత్కుపల్లి అన్నారు. ఇది ముప్పై ఏళ్ల కిందటి మాట అన్నారు. జగన్ ఇల్లు కులరహితమైనదని, పేదవాళ్లను ప్రేమతో చూసే ఇల్లు అన్నారు. జగన్ ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నారని, ఆయనకు నా మద్దతు ఉంటుందన్నారు. అవసరమైతే ఓరోజు ఆయనతో కలిసి పాదయాత్రలో నడుస్తానని, ఇంకా అవసరమైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో, సిపిఎం, సిపిఎంలతోను కలిసి నడుస్తానని చెప్పారు.
గొంతుకోసే నమ్మకద్రోహి, నరహంతకుడివి
చంద్రబాబుపై తాను ఇలా మాట్లాడటానికి చంద్రబాబే కారణమని మోత్కుపల్లి అన్నారు. నేను ఎవరికీ అమ్ముడుపోయే మనిషిని కాదన్నారు. అనుకున్నది సాధించే వరకు పోరాడే వ్యక్తిని అన్నారు. మహానాడుకు తనను ఆహ్వానిస్తే ఈ విషయాలు అక్కడే చెప్పేవాడిని అన్నారు. నమ్మేవాళ్ల గొంతుకోసే నమ్మకద్రోహి అన్నారు. దొరకని దొంగ చంద్రబాబు అన్నారు. ఆ రోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నేను ఎడిస్తే ఫోన్ ఎందుకు చేయలేదన్నారు. ఒక వ్యవస్థనే సృష్టించిన సృష్టికర్తను చంపిన నరహకంతకుడివి అని బాబుపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ను వాడుకొని వదిలేశారన్నారు. నాడు పవన్ ఇంటికి వేళ్లావని, ఆయన మీ ఇంటికి రాలేదన్నారు. గెలిచిన తర్వాత పవన్ను బయట పడేశావన్నారు. ఇది న్యాయమా అన్నారు. నాడు ప్రధాని మోడీ.. పవన్ను ప్రమాణ స్వీకారానికి పిలించి పదవి కావాలా అని అడిగారని, కానీ ఆయన వద్దన్నారని, అందుకు ఆయనను ప్రశంసించాలన్నారు.
తిరుపతి వస్తున్నా.. చంపుతారా, చంపండి
ఎన్టీ రామారావు స్పిరిట్ నాలో ఎంత కాలం ఉంటే అంతకాలం పని చేస్తానని మోత్కుపల్లి చెప్పారు. సోషల్ మీడియాలో తనపై ఏవేవో కథలు రాస్తున్నారని, తమాషాగా అనిపిస్తోందా అని మండిపడ్డారు. నన్ను ఏమైనా చంపుతారా, చంపండి, నేను తిరుపతికి వస్తున్నా... ఎన్టీఆర్ ఆశయం చంద్రబాబు అనే దుర్మార్గుడిని గద్దె దించడం అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసమే తాను తిరుమల మెట్లు ఎక్కుతున్నానని చెప్పారు. నేను ఇది కావాలని ఎవరినీ అడగలేదని, దేవుడిని కూడా అడగలేదన్నారు.