కేసీఆర్ వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం.. సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్..
సీఎం పదవిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు. సీఎం పదవిని ఎడమ కాలి చెప్పుతో పోల్చిన కేసీఆర్ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సీఎం పదవిని అవమానించడంతో పాటు ఎమ్మెల్యేలను కూడ కేసీఆర్ బెదిరించారని లేఖలో అరవింద్ ఆరోపించారు. ఇదే విషయంపై సోమవారం(ఫిబ్రవరి 8) ఢిల్లీలోని విజయ్ చౌక్లో అరవింద్ మీడియాతో మాట్లాడారు.

ఎమ్మెల్యేల్లో నమ్మకం లేనందువల్లే...: ఎంపీ అరవింద్
తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం, ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం ఎమ్మెల్యేల హక్కు అని.. అలాంటిది వారిని పరుష పదజాలంతో దూషిండమే గాక బెదిరింపులకు దిగడం దారుణమని అరవింద్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్పై విశ్వాసం సన్నగిల్లిందని, కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యేలకు కూడా నమ్మకం పోయిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి మార్పుపై చర్చ జరుగుతోందన్నారు.

అభద్రతా భావంలో కేసీఆర్ : ఎంపీ అరవింద్
ఇటీవల వరుస ఎన్నికల్లో అపజయాలతో టీఆర్ఎస్లో వ్యతిరేక గళం బలంగా వినిపిస్తోందని... దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అభద్రతాభావంలో ఉన్నారని అరవింద్ విమర్శించారు. అందుకే ఎమ్మెల్యేలపై బెదిరింపులకు దిగుతున్నారని.. కేసీఆర్ ఏ హక్కుతో శాసనసభ్యులను బెదిరిస్తున్నారని ప్రశ్నించారు. కాగా,పదవులు తనకు గడ్డిపోచతో సమానమంటూ గతంలో ఎన్నోసార్లు వ్యాఖ్యానించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆదివారం(ఫిబ్రవరి 7) నాటి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీఎం పదవి తనకు ఎడమ కాలి చెప్పుతో సమానమని వ్యాఖ్యానించినట్లుగా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ తెచ్చిన క్రెడిట్ ముందు సీఎం పదవి తనకు పెద్ద లెక్క కాదన్న ధోరణిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గవర్నర్కు జీవన్ రెడ్డి లేఖ...
అయితే పదవులు తనకు లెక్క కాదని చెప్పడం వేరు సీఎం పదవిని ఎడమ కాలి చెప్పుతో పోల్చడం వేరు అని... ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి కూడా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు లేఖ రాశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అటు రాజ్యాంగాన్ని, ఇటు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించడమేనన్నారు. మరోవైపు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ కేసీఆర్పై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications