వ్యాక్సిన్ వార్ : ఆ నీతిసూత్రం కేసీఆర్కు చెప్పలేదా-అసదుద్దీన్కు విజయశాంతి కౌంటర్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాక్సిన్ పాలసీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు వ్యాక్సిన్ కొనుగోళ్లు,పంపిణీ బాధ్యత మొత్తం కేంద్రమే తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం(జూన్ 7) స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధ్యక్షుడు,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తాజాగా విమర్శలు గుప్పించారు. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందనేలా ఆయన వ్యాఖ్యలు ధ్వనించాయి. అసద్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే బీజేపీ నేత విజయశాంతి ఆయనకు కౌంటర్ ఇచ్చారు.
Recommended Video
కేంద్రం జిమ్మిక్కులు... అసద్ విమర్శలు
'మరో అనవసర ప్రసంగం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. కేంద్రం వ్యాక్సిన్ పాలసీలో పునరాలోచనలో పడటానికి సుప్రీం కోర్టు తీర్పే కారణం. వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాలపై నింద మోపినప్పటికీ... వ్యాక్సిన్లను సమకూర్చడంలో మోదీ విఫలమయ్యారు.' అని అసదుద్దీన్ విమర్శించారు. మోదీకి మనుషుల ప్రాణాల కంటే రాజకీయాలే ముఖ్యమని మండిపడ్డారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచే చర్యల కన్నా కేంద్రం ఎప్పుడు జిమ్మిక్స్నే ఎంచుకుంటోందని విమర్శించారు. ఇవన్నీ పక్కనపెట్టండి... మోదీకి ఒకే ప్రశ్న... అసలు దేశంలో ఇంత భారీ స్థాయిలో వ్యాక్సిన్ల కొరత ఎందుకు వచ్చిందని అసద్ ప్రశ్నించారు.
ప్రైవేట్కు 25 శాతం కోటాను తప్పు పట్టిన అసద్
దేశంలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చామని చెబుతూ మోదీ తనను తానే అభినందించుకున్నారని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. నిజానికి 30 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా... మే ఆరంభం నాటికి కేవలం 10 శాతం మందికే వ్యాక్సిన్లు ఇచ్చారన్నారు. మిగితా 20శాతానికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే జులై నాటికి 60 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమవుతాయని... కానీ ప్రస్తుతం నెలకు 8 కోట్ల వ్యాక్సిన్ డోసులు మాత్రమే అందుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ వరకూ వ్యాక్సిన్ ఉత్పత్తిపై కేంద్రం ఏమీ ఖర్చు చేయలేదన్నారు. తాజాగా ప్రైవేట్ ఆస్పత్రులకు 25 శాతం వ్యాక్సిన్ కోటా ఇవ్వడాన్ని అసదుద్దీన్ పరోక్షంగా తప్పు పట్టారు. అంటే సంపన్నులు వీఐపీ క్యూలో నిలుచుంటే... పేదలు మాత్రం వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుండాలా అని ప్రశ్నించారు.
కోవిన్ లాటరీ లాంటిదని...
'చాలా దేశాల్లో కంటే భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మెరుగ్గా ఉందని మోదీ తనకు తానే అభినందనలు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కాదు... దేశంలో ఎంతమందికి వ్యాక్సిన్ వేశామన్నదే అసలు విషయం. కోవిన్ యాప్ను ఎవరైనా ఎలా గర్వకారణంగా భావిస్తారు. అదొక లాటరీ లాంటిది. నిన్న మొన్నటివరకూ అది కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఉంది. ఆ భాష అర్థం చేసుకునే జనాభా మన దేశంలో చాలా తక్కువ. మహిళలు,పేదలు,గ్రామీణ ప్రజలు... ఎంతోమందికి ఇంటర్నెట్ సదుపాయం లేదు. అలాంటప్పుడు నేరుగా వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవడాన్ని అడ్డుకోవడమెందుకు...?' అసదుద్దీన్ ప్రశ్నించారు.
విజయశాంతి కౌంటర్...
మరోవైపు అసదుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. 135 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న దేశంలో వ్యాక్సిన్ కొరత సహజమేనని అన్నారు. ప్రపంచం మొత్తం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని పేర్కొన్నారు. 2020 జులైలో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్కు ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలని ప్రశ్నించారు. ఒక ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ ట్విన్ పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు చెప్పలేదా అని చురకలంటించారు. 25శాతం వ్యాక్సిన్ను ప్రైవేట్ ఆస్పత్రులకు ఇవ్వడం వీఐపీ కల్చర్ అయితే... టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యాక్సిన్ కొనుగోలు కోసం అనుమతినివ్వాలని కోరుతున్నది బ్లాక్ మార్కెట్ కల్చర్ కోసమా అని నిలదీశారు.