అలాంటి వాటి జోలికెళ్తే: ఎమ్మెల్యేలకు కవిత ఘాటు హెచ్చరిక
హైదరాబాద్: ఎమ్మెల్యేలకు తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత బుధవారం నాడు హెచ్చరికలు జారీ చేశారు. సెటిల్మెంట్లు, వివాదాల జోలికి వెళ్లే ఎమ్మెల్యేల విషయంలో ఊరుకునే పరిస్థితి లేదని చెప్పారు. వారి పైన కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పరచిన తమ పార్టీ బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తోందని చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలు ప్రజల కోసమేనని, వాటి పైన విమర్శలు చేయడం సరికాదన్నారు.
తమ ప్రభుత్వం పాలలో సంస్కరణలు తెచ్చే ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. వివాదాలు, సెటిల్మెంట్ల జోలికి వెళ్లే ఎమ్మెల్యేల పైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.
ఓయులో విద్యార్థుల బైక్ ర్యాలీ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ అమరవీరులకు ఆత్మగౌరవాన్ని తెలుపుతూ నవ తెలంగాణ విద్యార్థి సంఘం ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి గన్ పార్క్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించాలని విద్యార్థులు నిర్ణయించారు. అయితే, బైక్ ర్యాలీ ప్రారంభించి ఎన్సీసీ గేటు వద్దకు రాగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో రాష్ట్ర అవతరణ వేడుకలు
రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో తెలంగాణ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఇంటెలిజెన్స్ ఐజీ మహేశ్ భగవత్ మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రముఖుల పర్యటన సమయంలో ఇంటెలిజెన్స్ సేవలు ప్రశంసనీయమన్నారు. బాంబు నిర్వీర్య జాగిలాల బృందాలు సమర్థంగా పని చేస్తున్నాయన్నారు. నల్గొండ జిల్లాలో భారీ చోరీ కేసును జాగిలాల బృందం గంటల్లోనే ఛేదించిందని చెప్పారు. 452 పోస్టుల భర్తీ ద్వారా ఇంటెలిజెన్స్ విభాగం మరింత బలపడనుందన్నారు.