ఎంపీ రేవంత్ రెడ్డి విస్మయం... ప్రత్యర్థులకు వార్నింగ్... ఆ కథనాల్లో నిజం లేదని ప్రకటన...
కాంగ్రెస్లో చీలికలు ఉన్నాయని... తాను ప్రియాంక గాంధీ నాయకత్వాన్ని ప్రమోట్ చేస్తున్నానని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. తాను ప్రియాంక గాంధీ వర్గంలో చేరినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు హల్చల్ చేస్తున్నాయని... అవి పూర్తిగా నిరాధారమని అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో గ్రూపులే లేవని... బూత్ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ వరకు ప్రతీ ఒక్కరూ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజల కోసం పోరాడుతున్నారని చెప్పారు.
రేవంత్ విస్మయం...
ప్రియాంక వర్గంలో తాను చేరినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చూసి తాను విస్మయానికి గురైనట్లు రేవంత్ అన్నారు. ఎలాంటి వివరణలు లేకుండా ప్రచారంలోకి వచ్చే ఇలాంటి కథనాలను ప్రజలు పట్టించుకోవద్దన్నారు. అయితే ఇలాంటి కథనాలు శ్రుతి మించుతున్నప్పుడు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని... అందుకే దీనిపై స్పందిస్తున్నానని చెప్పారు. ప్రజా జీవితంలో తన ఎదుగుదలను అడ్డుకోవడానికో,మానసిక స్థైర్యం దెబ్బతీసేందుకో ప్రత్యర్థులు ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతుంటారని ఆరోపించారు.
అభిమానులకూ విన్నపం...
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక... ఉన్నవి,లేనివి కల్పించి ప్రచారంలో పెట్టడం సులువైపోయిందన్నారు. తాను ప్రియాంక వర్గంలో చేరినట్లుగా... ఆమె నాయకత్వాన్ని ప్రమోట్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల్లో నిజం లేదన్నారు. ఇలాంటి కథనాలను చూసి అపోహలకు లోను కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనను అభిమానించే వాళ్లకు కూడా రేవంత్ ఓ విజ్ఞప్తి చేశారు. కొన్ని సందర్భాల్లో తనపై అభిమానం కొద్ది అత్యుత్సాహంతో పెట్టే పోస్టులు... పార్టీకి,తనకూ నష్టమే చేస్తాయి తప్ప ఎలాంటి లాభం ఉండదన్నారు.
ప్రత్యర్థులకు వార్నింగ్....
ఈ సందర్భంగా తన ప్రత్యర్థులకు ఓ విషయం చెప్పదలుచుకున్నానని ఎంపీ రేవంత్ అన్నారు. తనపై ఎలాంటి దాడి చేసినా,విమర్శలకు దిగినా... తాను జవాబు చెప్తానని అన్నారు. అంతే తప్ప ఇలా దొడ్డిదారిలో లేని పోని అసత్య ప్రచారాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తనపై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కేసీఆర్,కేటీఆర్పై విమర్శలు...
అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్కు రేవంత్ రెడ్డి ఓ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అందులో పేర్కొన్నారు. క్షేత స్థాయిలో నష్ట తీవ్రత మీకు అర్ధం కావడం లేదో, లేక అర్ధం కానట్టు నటిస్తున్నారో తెలియడం లేదని సీఎంని ఉద్దేశించి విమర్శించారు. బాధ్యతను పూర్తిగా అధికార యంత్రాంగానికి వదిలేసి మీరు ఫాంహౌస్కే పరిమితం కావడం తీవ్ర ఆక్షేపణీయమని మండిపడ్డారు. మీకు ప్రత్యామ్నాయంగా కేటీఆర్ను తీసుకొచ్చే ప్రయత్నమే తప్ప... ప్రజల కష్టాలను, రైతుల ఆవేదనను తీర్చే చిత్తశుద్ధి మీ చర్యల్లో ఇసుమంతైనా కనిపించడం లేదన్నారు. మంత్రి కేటీఆర్ వరంగల్లో షో చేసి బాధ్యత తీర్చేసుకున్నారని విమర్శించారు.