మునుగోడులో ఇంటింటి ప్రచారం కోసం కాంగ్రెస్ చార్జిషీట్.. టార్గెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!!
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఈనెలాఖరులో వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో టిఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాయి. ఇక తాజాగా ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని అధికార బీజేపీ, తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ చార్జిషీట్ వేసింది. రెండు పేజీల కరపత్రాన్ని రూపొందించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
Recommended Video
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం.. చార్జిషీటు వేసిన కాంగ్రెస్
మునుగోడులో పరిష్కారం కాని సమస్యలు, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల వైఫల్యం, తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిన మోసం, రాజగోపాల్ రెడ్డి చేసిన మోసాలను ప్రస్తావిస్తూ కరపత్రాన్ని తీసిన కాంగ్రెస్ పార్టీ, ఫోటోలను కరపత్రాలలో ప్రచురించి మరీ టార్గెట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ వేసిన కరపత్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు ల ఫోటోలను కూడా ప్రచురించి మరీ టార్గెట్ చేస్తుంది.
మన మునుగోడు మన కాంగ్రెస్ పేరుతో ఈ మోసాలను మర్చిపోవద్దు ఈ మోసగాళ్ళను విడిచిపెట్టదు అంటూ కరపత్రాన్ని ముద్రించిన కాంగ్రెస్ పార్టీ కరపత్రం లో అనేక అంశాలను ప్రస్తావించింది.
కరపత్రం లో స్థానిక సమస్యలను ప్రస్తావించిన కాంగ్రెస్
స్థానికంగా ఉన్న సమస్యలను ఏకరువు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల పేరుతో తీసుకున్న భూములకు పరిహారం కేసీఆర్ సర్కారు ఇవ్వడంలేదని, చౌటుప్పల్ లో డిగ్రీ కాలేజ్, మినీ ట్యాంక్ బండ్, మునుగోడులో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయలేదని టార్గెట్ చేసింది. నారాయణపురంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని, నియోజకవర్గం లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు, చుండూరు నాంపల్లి రోడ్డును డబల్ రోడ్డుగా మార్చే హామీని విస్మరించారని, ఫ్లోరోసిస్ బాధితులకు పింఛన్ ఇవ్వడంలేదని, అసంపూర్తిగా డిండి, చర్లగూడెం, కృష్ణరాయని పల్లి, బ్రాహ్మణ వెల్లంల, రాచకొండ ఎత్తిపోతల ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ కరపత్రంలో పేర్కొంది.
రాష్ట్ర సమస్యలను ప్రస్తావించి కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేసిన కాంగ్రెస్
ఇక ఇదే సమయంలో రాష్ట్రస్థాయి సమస్యలను కూడా ప్రస్తావించిన కాంగ్రెస్ పార్టీ దళిత సీఎం చేస్తానని హామీ మరిచారని, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని, దళిత కుటుంబాలకు అందరికీ 10 లక్షల రూపాయలు ఇవ్వలేదని టార్గెట్ చేసింది. ప్రతి రైతు కుటుంబం పై 1.52 లక్షల రూపాయల అప్పు భారం పడిందని, రాష్ట్రంలో రైతులు ఎనిమిది వేల మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొంది. అమ్మహస్తం రద్దు చేశారని, రేషన్ బియ్యం తో సరి పెడుతున్న కెసిఆర్, విద్యుత్తు, బస్సు ఛార్జీలను పెంచుతున్నారని కెసిఆర్ సర్కార్ ను టార్గెట్ చేసింది.
బిజెపి వైఫల్యాలను టార్గెట్ చేసిన కాంగ్రెస్
ఇక ఇదే సమయంలో బిజెపి మోసాలను కరపత్రంలో ముద్రించిన కాంగ్రెస్ పార్టీ పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచిందని, పన్నులతో సామాన్యుడిపై భారం మోపిందని, ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఎత్తేసే ప్రయత్నం చేస్తుందని టార్గెట్ చేసింది. అంతేకాదు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా, ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వకుండా మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్
ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ బీజేపీతో 22వేల కోట్ల రూపాయల మైనింగ్ డీల్ కుదుర్చుకుని నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని కరపత్రంలో పేర్కొంది. టిఆర్ఎస్ పార్టీ తో దోస్తీ చేసి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్టర్లు తెచ్చుకున్న స్వార్ధపరుడు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేసింది. ప్రతి మండలంలో సొంతడబ్బుతో పాఠశాల కళాశాలలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఆ హామీలను బుట్టదాఖలు చేశారని మండిపడింది.
నియోజకవర్గంలోని పదివేల మంది యువతకు ఉపాధి అంటూ మోసం మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను గెలిచిన వంద రోజుల్లో చర్లగూడెం రిజర్వాయర్ ముంపు బాధితులకు పరిహారం ఇప్పిస్తానని, అలా చేయకపోతే ప్రాణత్యాగం చేస్తానని చేసిన ప్రకటన కూడా మోసమేనని టార్గెట్ చేసింది.