TRSను మరోసారి అధికారంలోకి తేబోతున్న బీజేపీ, కాంగ్రెస్?
మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి 10,309 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారతీయ జనతాపార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విజయానికి చాలాదూరంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీని మూడోస్థానానికి పరిమితం చేయడంద్వారా రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో స్పష్టత వచ్చింది. ప్రధాన పోరు టీఆర్ఎస్, బీజేపీ మధ్యే జరగబోతోందని స్పష్టమైంది.

మునుగోడులో తేలిపోయింది!
కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలముందని అనుకుంటున్నప్పటికీ ఈ ఎన్నికల్లో అది తేలిపోయింది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన అభ్యర్థి కావడంతో మునుగోడు నియోజకవర్గం వరకే పరిమితమైందా? ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కుదురుకుంటుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ ప్రతి నియోజకవర్గంలోను బీజేపీకి కోమటిరెడ్డి లాంటి అభ్యర్థులు దొరకరు కాబట్టి తమనుంచి మిగతా రెండు పార్టీలకు బలమైన పోటీ ఉంటుందని కాంగ్రెస్ నేతలు వెల్లడిస్తున్నారు.

భవిష్యత్తును ఆవిష్కరించిన మునుగోడు
ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు 97,006 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 23,906, బీజేపీకి 86,697 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీకి వచ్చిన ఓట్లన్నీ కలిపితే 1,10,603 ఓట్లు వచ్చాయి. బీఎస్పీకి 4146 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ మెజారిటీ 10,309 గా ఉంది. ఇతర పార్టీలకు పోలైనవి, స్వతంత్ర అభ్యర్థులకు వచ్చినవన్నీ కలుపుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా పెరిగిందని భావించవచ్చు. రానున్న రోజుల్లో తెలంగాణకు జరిగే సార్వత్రిక ఎన్నికలు ఏ రీతిన ఉండబోతున్నాయో మునుగోడులో వచ్చిన ఫలితం, నమోదైన ఓట్లు ఆవిష్కరించాయి.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును పంచుకున్న బీజేపీ, కాంగ్రెస్
ఒకవేళ టీఆర్ఎస్ 25వేల మెజారిటీతో గెలుపొందితే ప్రభుత్వ సానుకూల ఓటుగా పరిగణించవచ్చు. కానీ మెజారిటీ 10వేలకు పరిమితమైంది. టీఆర్ఎస్ అంచనాలకు 15వేలు తగ్గింది. అంటే రానున్న రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ, కాంగ్రెస్ పంచుకోబోతున్నాయి. ఇది టీఆర్ఎస్ కు కలిసివచ్చే పరిణామమవుతోంది. వాస్తవానికి ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేయడమనేది జరగదు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటును పంచుకోబోతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎలా అధిగమించాలా? అని టీఆర్ఎస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్న సమయంలో వారికి మునుగోడు ఒక దారి చూపించినట్లైంది.












Click it and Unblock the Notifications