మూసీ ఉగ్రరూపం.. ఆ రూట్లలో రాకపోకలు బంద్..
హైదరాబాద్ లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వరద ప్రవాహంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఉద్యోగం, ఉపాధి, స్కూల్స్, కాలేజీలకు వెళ్లే వాళ్లు నరక యాతన అనుభవిస్తున్నారు. అలాగే భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ కు భారీగా వరద వస్తున్న క్రమంలో అధికారులు ఇటీవల నాలుగు గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి విడుదల చేశారు. అలా వర్షాలు, వరద కారణంగా ముసీ నది ఉప్పొంగుతోంది.
మూసీ ఉగ్రరూపంతో మూసీ నది పరివాహకంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటూ ఉన్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
అయితే భారీ వర్షాలు, వరద ధాటికి అంబర్పేట్ వద్ద మూసారాంబాగ్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు అప్రమత్తమై వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. అంబర్పేట్ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. అలాగే మలక్పేట్ నుంచి ముసారాంబాగ్ బ్రిడ్జి మీదుగా అంబర్ పేట్ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులను కూడా దారి మళ్లించారు. దీంతో ప్రయాణ సమయంపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మూసారాంబాగ్ లో రెండేళ్ల కిందట హైలెవల్ బ్రిడ్జి పనులు ప్రారంభం అయ్యాయి. అయితే ఇప్పటికీ కేవలం 20 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నత్తనడకన సాగుతున్న పనులతో అంబర్పేట్, మలక్పేట్ మధ్య రాకపోకలకు నిరంతరం అంతరాయం కలుగుతోంది. ఇక వర్షం పడితే ఆ రూట్ మొత్తం మూసివేస్తున్నారని.. దీంతో అదనంగా 5 కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు.












Click it and Unblock the Notifications