మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్ట్ లో కీలక అడుగు.. నాగోల్ గౌరెల్లి మాస్టర్ ప్లాన్!
మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుపై తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫోకస్ పెట్టారు. మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్ట్ లో భాగంగా తొలిదశ పనుల కోసం రూ. 7,345.12 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇవ్వటంతో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయ్యాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్డీ బోధి పెవిలియన్లో జరిగిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ సమీక్షా సమావేశంలో అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు.
హెచ్ఎండీఏ విధానం ప్రకారం భూసమీకరణ చేపట్టాలని సూచన
నాగోల్ నుంచి గౌరెల్లి వరకు ఉన్న ప్రాంతంలో వ్యవసాయ భూములు, ఖాళీస్థలాలు ఎక్కువగా ఉన్నందున అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయవచ్చని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికారులతో సర్వే చేయించి అవసరమైన భూమిని గుర్తించాలని, హెచ్ఎండీఏ విధానం ప్రకారం భూసమీకరణ చేపట్టాలని సూచించారు. ఎఫ్టీఎల్, బఫర్జోన్, ఎసైన్డ్ భూముల విషయంలో చట్టపరమైన సమస్యలు రాకుండా స్పష్టమైన విధానంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

టీడీఆర్ సర్టిఫికెట్లతో భూసేకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మొదటి దశలో జంట జలాశయాల నుంచి బాపూ ఘాట్ వరకు 21 కి.మీ. పొడవునా నది ఇరువైపులా టీడీఆర్ సర్టిఫికెట్లతో భూసేకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం టీడీఆర్కు మార్కెట్లో మంచి ధర ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పించి ఒప్పించాలన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఎంఆర్డీసీఎల్, జీహెచ్ఎంసీ, సీఎంసీ అధికారులను ఆదేశించారు.
ఓంకారేశ్వర ఆలయ మాస్టర్ ప్లాన్ సిద్ధం
టీడీఆర్ బాండ్ల జారీపై వారం వారం సమీక్ష నిర్వహించాలని, అభివృద్ధి పనులకు తక్కువ వడ్డీ రుణాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కొత్వాల్గూడ ఎకో పార్కుకు ప్రాచుర్యం కల్పించాలని హెచ్ఎండీఏను కోరారు. గండిపేట జలాశయం వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణంపై కూడా సమీక్ష చేసిన సీఎం పలు కీలక సూచనలు చేశారు. మాస్టర్ ప్లాన్ దాదాపు సిద్ధమైందని, పది రోజుల్లో టెండర్లు పిలుస్తామని అధికారులు తెలిపారు.
ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి టెండర్లు
ఆలయం, రహదారి విస్తరణ, ద్వీపం అభివృద్ధి, 100 అడుగుల శివుని విగ్రహం వంటి పనులను ఒకేసారి టెండర్ చేయనున్నారు.ఈ సమావేశంలో సీఎం కార్యదర్శి, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, నగరపాలక సంస్థల కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మూసీ ప్రాజెక్టు వేగవంతంగా ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications