20 నిమిషాల్లో రూ. 12 కోట్లు చేతికి: మద్యం పార్టీతో జోష్, అంతా గప్చుప్
ముత్తూట్ ఫైనాన్స్ను 20 నిమిషాల్లో దోచుకున్న దొంగలు తమ స్థావరానికి చేరుకున్న తర్వాత విజయగర్వంతో ఊగిపోయారు. మందుతో విందు చేసుకున్నారు. అయితే...
హైదరాబాద్: ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీదారుల విజయగర్వం ఎంతో సేపు నిలువలేదు. కేవలం 20 నిమిషాల్లో రూ.12 కోట్ల విలువ చేసే 42 కిలోల బంగారం చేతికి చిక్కిందనే విజయగర్వంతో ఊగిపోయారని తెలుస్తోంది. తమ స్థావరానికి చేరుకున్న తర్వాత మందుతో విందు చేసుకున్నారట. రామచంద్రాపురంలోని ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించిన తర్వాత కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అయితే, రాత్రి విందు చేసుకున్న దొంగలు మర్నాడే భయానికి లోనై అప్రమత్తమయ్యారు. 29వ తేదీన తెలుగు టీవీ ఛానెళ్లలో దోపిడీకి సంబంధించిన వార్తలను చూసిన తర్వాత వారు వ్యూహం మార్చుకున్నారు. 16 పోలీసు బృందాలు తమను గాలిస్తున్నాయనే సమాచారం తెలుసుకొని జాగ్రత్తపడే ప్రయత్నం చేశారు. దోపిడీకి ఉపయోగించిన స్కార్పియో, ద్విచక్రవాహనాన్ని వాడీలోని స్థావరంలోనే వదిలిపెట్టి రైళ్లొ ముంబైకి పారిపోయారు.
అక్కడే తలా కొంత బంగారాన్ని తీసుకొని విడిపోయారు. ఫోన్లో అసలు మాట్లాడుకోవద్దంటూ చెప్పుకుని ఎవరి దారిన వెళ్లారు. అత్యవసరమైతే కలుసుకునేందుకు మూడు కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇళ్లకు వెళ్లకుండా సత్రాల్లో బస చేస్తూ గడిపారు. అయితే, వారి గురించి రైల్వే టీసీ ద్వారా పోలీసులకు సమాచారం దొరికింది. వారు టికెట్లు తీసుకుని జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కినట్లు టీసీ ద్వారా పోలీసులు తెలుసుకున్నట్లు సమాచారం.

ముంబైకి పారిపోయిన తర్వాత కూడా బంగారాన్ని దోపిడీదారులు అమ్మలేకపోయినట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యానికి తోడు పోలీసు నిఘా ఉండటంతో సొత్తును పలు ప్రాంతాల్లో దాచి ఉంచింది. దోపిడీలో సర్దార్జీగా, సీబీఐ అధికారిగా వ్యవహరించిన ముఠా నేత లక్ష్మణ్తోపాటు మరో సభ్యుడు వేరే వాహనంలో ముంబై నుంచి వాడీకి వెళ్లారు.
అక్కడే బంగారం దాచి ఉంచడంతో తెచ్చుకునేందుకు వెళ్లిన క్రమంలో సైబరాబాద్ పోలీసులకు చిక్కారు. అయితే వారిని విచారించినా పూర్తి స్థాయిలో బంగారం ఆచూకీ ఇంకా లభించనట్లు తెలిసింది. ప్రస్తుతం ముగ్గురు దొంగలు పోలీసుల అదుపులో ఉన్నారు. మిగతా ముగ్గురితోపాటు బంగారం కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications