కేసీఆర్ మనవడికీ పదవచ్చేదే, కానీ: రవినాయక్ మంచోడంటూ బండి సంజయ్, విజయశాంతి ఫైర్
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేత విజయశాంత్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ సాధించింది టీఆర్ఎస్ కాదని, ఉద్యమకారుల వల్లే తెలంగాణ వచ్చిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రవి నాయక్ తరపున ప్రచారం నిర్వహించారు.
కేసీఆర్ మనవడికీ పదవి వచ్చేదే..
కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులున్నాయి. కానీ, ఒక్క మనవడికే లేదు. అతనికి కూడా వయసు ఉంటే.. పదవి ఇచ్చేవాడని ఎద్దేవా చేశారు బండి సంజయ్. బూతు పురాణం, అబద్ధాల మాటలు చెప్పేది కేసీఆర్, కేటీఆర్ లేనని అన్నారు. తెలంగాణ బిల్లుకు సుష్మా స్వరాజ్ మద్దతివ్వడం వల్లే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందన్నారు.గ్రామీణ ఉపాధి హామీ, చెట్లు నాటడం, మరుగుదొడ్ల నిర్మాణానికి, వీధిలైట్లకు, రోడ్లకు, డబుల్ బెడ్రూంలకు ఇలా అనేక పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. బియ్యానికి కేంద్రం రూ. 29 ఇస్తే.. కేసీఆర్ రూపాయి ఇస్తున్నాడన్నారు. కేంద్ర పథకాలు రాష్ట్రంలో సక్రమంగా అమలు చేయకపోవడం ద్వారా పేదలు ఇబ్బందిపడుతున్నారన్నారు.
రాష్ట్రంలో మూర్ఖపు పాలన నడుస్తోందంటూ బండి సంజయ్
రాష్ట్రంలో మూర్ఖపు పాలన నడుస్తోందన్నారు. ఇంటర్ విద్యార్థుల మరణాలకు కేసీఆరే కారణమన్నారు. రాష్ట్రంలో రైతులు, యువకులు చనిపోతే కేసీఆర్ స్పందించరని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్కు దర్బార్ తెలియదు కానీ, బార్ తెలుసంటూ తీవ్ర విమర్శలు చేశారు బండి సంజయ్. ఇక జానారెడ్డి గెలిస్తే.. టీఆర్ఎస్ లో కలవడమే ఉంటుందన్నారు. బీజేపీ అభ్యర్థి రవి నాయక్ మంచోడని.. గెలిస్తే ప్రజలకు సేవ చేస్తానడని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. వారు డబ్బు పంచితే తీసుకుని బీజేపీకే ఓటేయాలని కోరారు. తాను చెప్పినవన్నీ తప్పయితే.. నిడమనూరు చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా.. లేదంటే సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తారా? అని బండి సంజయ్ సవాల్ విసిరారు.
తెలంగాణ ప్రజలను చావుదగ్గరకు తీసుకెళ్లిన కేసీఆర్..
విజయశాంతి మాట్లాడుతూ.. కల్వకుంట్ల వాళ్లకు సవాల్ చేయడమే తప్ప.. చర్చకు వచ్చే దమ్ము లేదని అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి టీఆర్ఎస్ గెలవాలని చూస్తోందన్నారు. టీఆర్ఎస్ ఏం చేయలేదు కాబట్టే.. ప్రజలు బీజేపీకి ఓటేయాలని కోరారు. జానారెడ్డి రిటైరైపోయారని అన్నారు. చావునోట్ల తలపెట్టి తెలంగాణ తెచ్చానంటున్న కేసీఆర్.. తెలంగాణ ప్రజలను చావుకు దగ్గర చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని.. బీజేపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను టీఆర్ఎస్ పక్కదారిపట్టిస్తోందని ఆరోపించారు. డబ్బులు, మద్యానికి విలువైన ఓటును అమ్ముకోవద్దని కోరారు.