నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం: టికెట్ ధరలు ఎంతంటే?
ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఎంతగానో ఎదురుచూస్తున్న నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు బోటు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. కార్తిక మాసం తొలి రోజున తెలంగాణ పర్యాటక శాఖ ప్రారంభించింది. గత ఐదేళ్లుగా ప్రణాళికలు వేసినప్పటికీ.. నాగార్జున సాగర్లో సరైన స్థాయిలో నీరు లేకపోవడం, కరోనా మహమ్మారి తదితర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.
ఇటీవల విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు గరిష్ట స్థాయిలో నీటి లభ్యత ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించింది. దాదాపు 120 కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రయాణానికి మొదటి రోజు రాష్ట్రంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు.

నాగార్జున సాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాంత అందాలను వీక్షించేలా లాంచీ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ పర్యాటక శాఖ. మరొక మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను కూడా పర్యాటకాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది.
కొల్లాపూర్ మండలం సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు శనివారం ప్రారంభించారు. అక్కడ్నుంచి శ్రీశైలం వరకు 120 కిలోమీటర్ల మేర 7 గంటలపాటు ఈ ప్రయాణం ఉంటుంది. లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ. 2 వేలు, పిల్లలకు రూ. 1600గా టికెట్ ధరలను నిర్ణయించారు.

నాగార్జున సాగర్ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడుపుతామని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. పర్యాటకుల డిమాండ్ మేరకు నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించాం. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకుని రెండో రోజే మళ్లీ సాగర్కు తిరుగు ప్రయాణం అయ్యేలా ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications