కాంగ్రెస్కు హ్యాండ్?.. కోమటిరెడ్డికి షాక్?.. సీఎం కేసీఆర్ను కలిసిన చిరుమర్తి..!
హైదరాబాద్ : వలసవస్తున్న నేతలతో గులాబీవనం మరింత వికసిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ గొంతులు చించుకుని గులాబీ దండుపై ఆరోపణలు గుప్పించిన నేతలు సైతం అక్కడికే క్యూ కడుతున్నారు. చేయి గుర్తుపై గెలిచిన నేతలు క్రమక్రమంగా కారెక్కుతున్నారు. ఇప్పటికే ఆత్రం సక్కు, రేగ కాంతారావు గులాబీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా నకిరేకల్ ఎమ్మెల్యే, కోమటిరెడ్డి నమ్మినబంటు చిరుమర్తి లింగయ్య కారు డోరు వైపు చూస్తున్నారు. ఆయన కూడా చేయి వీడి గులాబీవనంలోకి వస్తారనే ప్రచారంతో సీఎం కేసీఆర్ ను కలిశారనే వార్త హాట్ టాపిక్ గా మారింది.

కాంగ్రెస్ వీరవిధేయుడు.. కారు వైపు చూపు
నల్గొండ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట లాంటిది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా ఉన్నపటికీ.. ఆ జిల్లాలో కాస్తా తక్కువనే చెప్పాలి. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ కు నల్గొండ రాజకీయాల్లో తిరుగులేదంటారు. అలాంటిది మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాసింత డీలా పడింది కాంగ్రెస్. అటు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోవడం ఆ పార్టీకి మింగుడుపడని అంశం. అదలావుంటే హస్తం గుర్తుపై గెలిచిన ఆ కొద్దిమంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు.
గులాబీ ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతం అవుతోంది. ఎన్నికల వేళ వంద సీట్లు ఖాయమన్న సీఎం కేసీఆర్.. ఆ రూట్లోనే వెళుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. టీఆర్ఎస్ 88 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసింది. టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో అసెంబ్లీలో సంఖ్యాబలం 91 కి చేరింది. ఈ నేపథ్యంలో ఇంకా కారెక్కేవారు చాలామంది క్యూ లో ఉన్నారనే టీఆర్ఎస్ నేతల మాటలకు బలం చేకూరుతోంది. తాజాగా కోమటిరెడ్డి నమ్మిన బంటు, కాంగ్రెస్ వీరవిధేయుడిగా ముద్రపడ్డ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కారు వైపు చూస్తున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ను కూడా కలిశారనే టాక్ వినిపిస్తుండటంతో ఆయన చేరిక కూడా దాదాపు కన్ఫామ్ అయినట్లే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

చిరుమర్తి కారెక్కితే ఎలా?
2014 ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్యపై 2వేల మెజార్టీతో గెలుపొందారు టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నాటికి సీన్ రివర్సయింది.
కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చిరుమర్తి లింగయ్య.. టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశంపై దాదాపు 8వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఇప్పుడాయన టీఆర్ఎస్ పార్టీలోకి వస్తారనే ప్రచారం చర్చానీయాంశంగా మారింది. ఆ మేరకు సీఎం కేసీఆర్ ను కలిశారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఒకవేళ అదే గనక జరిగితే కోమటిరెడ్డి వత్తిడితో చిరుమర్తికి టికెట్ కేటాయించిన కాంగ్రెస్ హైకమాండ్ రియాక్షన్ ఎలా ఉంటుందోననేది ఆసక్తికరంగా మారింది.

కోమటిరెడ్డి వత్తిడితోనే చిరుమర్తికి టికెట్.. మరి ఇప్పుడెలా?
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా నకిరేకల్ స్థానం వేరే వారికి ఇస్తారనే ప్రచారం జరిగింది. దాంతో చిరుమర్తి వర్గీయులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ తో చిరుమర్తికి సన్నిహిత సంబంధాలు ఉండటంతో.. ఏకంగా వెంకటరెడ్డి రంగంలోకి దిగారు. ఇటు రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి.. అటు ఢిల్లీ పెద్దలను సైతం ఒప్పించారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తికి రాకుంటే.. తాను కూడా పోటీ నుంచి తప్పుకుంటాననే రీతిలో మాట్లాడారు వెంకటరెడ్డి. దాంతో దిగొచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు చిరుమర్తి లింగయ్యకే నకిరేకల్ టికెట్ కన్ఫామ్ చేసింది. అంతలా కోమటిరెడ్డి బ్రదర్స్ తో అవినాభావ సంబంధమున్న చిరుమర్తి.. ఇప్పుడు గులాబీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే వార్త షాకింగ్ గా మారింది.












Click it and Unblock the Notifications