నందమూరి సుహాసిని ఆకట్టుకోలేకపోతున్నారా? అదే ప్లస్, కూకట్పల్లిలో గెలుపుని నిర్ణయించేది వీరే!
హైదరాబాద్: మహాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని ప్రచారంలో దూసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆమె ప్రచార ప్రసంగం అంతగా ఆకట్టుకునేలా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏ అభ్యర్థికి అయినా, ఏ పార్టీ నేతకు అయినా ప్రసంగం ముఖ్యం.
కానీ సుహాసిని ప్రసంగం ఓటర్లను అంతగా ఆకట్టుకోలేకపోతోందని అంటున్నారు. ఆమె నామినేషన్ వేయడానికి రెండు రోజుల ముందు మీడియా ముందుకు వచ్చారు. తాను కూకట్పల్లి నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. అప్పుడు ఆమె మాట్లాడిన తీరుపై సెటైర్లు వచ్చాయి. ఏదో పాఠం అప్పచెప్పినట్లుగా మాట్లాడారని విమర్శలు వచ్చాయి.
నందమూరి సుహాసినికి గట్టి షాక్, తెరాసలో చేరిన కూకట్పల్లి కీలక నేత: కారణం ఇదీ
పొడిపొడిగా మాట్లాడిన సుహాసిని
సుహాసిని కూకట్పల్లిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ఆమె ప్రసంగం ఓటర్లను ఆకట్టుకునేలా లేదని చెబుతున్నారు. రాజకీయ రంగంలోకి దిగుతానని ఆమె ప్రకటించినప్పటి నుంచి రెండుసార్లు మాత్రమే ఆమె మీడియా ముందుకు వచ్చారు. మొదటిది నామినేషన్కు రెండు రోజుల ముందు తాను పోటీ చేస్తున్నానని చెప్పడానికి, రెండోది నామినేషన్ వేసినప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించిన సమయంలో. ఆ రెండుసార్లు కూడా ఆమె పొడిపొడిగా మాట్లాడారు. మొదటిసారి అయితే పాఠం ఏప్పచెప్పినట్లుగా మాట్లాడారు.
ప్రసంగం ఆకట్టుకోలేకపోయినా గెలుపు ఖాయం
ఆమె ప్రసంగం ఆకట్టుకునేలా లేకపోయినప్పటికీ నందమూరి కుటుంబం పట్ల ఉన్న అభిమానంతో పాటు, అక్కడి సామాజిక సమీకరణాలు ామెకు బాగా ప్లస్ అని చెబుతున్నారు. ఇక్కడి సామాజిక సమీకరణాల కారణంగా ఆమె అద్భుత విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. 2014లో మాధవరం కృష్ణారావు గెలిచారు. ఆయన ఆ తర్వాత తెరాసలో చేరారు. 2009లో లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచారు.
కూకట్పల్లిలో గెలుపుని నిర్ణయించేది వీరే
కూకట్పల్లి నియోజకవర్గంలో కాపు, కమ్మ, బీసీ, ఎస్సీ ఓటర్ల ప్రభావం ఎక్కువ. ఇక్కడి అభ్యర్థి గెలుపోటములను దాదాపు వీరే నిర్ణయిస్తారని చెబుతారు. కూకట్పల్లిలో 3.17 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కీలక ప్రాంతమైన హౌసింగ్ బోర్డులో కమ్మ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బీసీలు టీడీపీకి అండగా ఉంటారు. ఈ నేపథ్యంలో సుహాసిని సులభంగా గట్టెక్కుతుందని చెబుతున్నారు.
ఇవీ సుహాసినికి ప్లస్
మాధవరం కృష్ణారావు తెరాస నుంచి పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీ ఆయన బంధువు మాధవరం కాంతారావు బరిలోకి దింపింది. అలాగే, కెపీహెచ్బీ కార్పోరేటర్ హరీష్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇవి టీఆర్ఎస్ ఓట్లను చీల్చుతాయని భావిస్తున్నారు. ఈ సమీకరణాలతో.. సుహాసిని మొదటిసారి పోటీ చేస్తున్నప్పటికీ ఇక్కడి నుంచి ఆమె అద్భుత విజయం సాధిస్తుందని చెబుతున్నారు. ఇతర ఓటర్ల కంటే కాపులు ఎక్కువగా ఉన్నప్పటికీ, కాపు, బీసీ, ఎస్సీల ఓట్ల కారణంగా సుహాసిని భారీ మెజార్టీతో గెలుస్తుందని చెబుతున్నారు. ఫతేనగర్, బాలానగర్ ప్రాంతాల నుంచి టీడీపీకి ఓట్లు వస్తాయని భావిస్తున్నారు.
నందమూరి ఫ్యామిలీ ప్రచారం
సుహాసిని తరఫున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ప్రచారానికి సిద్ధమయ్యారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాలలోని వివిధ కమ్యూనిటీలతో భేటీ అయి సుహాసినికి ఓటు వేయాల్సిందిగా కోరనున్నారని తెలుస్తోంది.