తల నరుక్కుంటానన్నారు, కెసిఆర్ తల అలాగే ఉంది: నారా లోకేష్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి వస్తే దళిత నేతను ముఖ్యమంత్రిని చేస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారని, కానీ చేయలేదని, కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, అయినా ఆయన తల అలాగే ఉందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ వ్యాఖ్యానించారు. బిజెపి, టిడిపి కూటమి జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచార సభలో ఆయన మంగళవారం రాత్రి నిజాం కళాశాల మైదానంలో ప్రసంగించారు.
తెలంగాణ ఏర్పడి 18 నెలలు అయిందని, తెలంగాణ 16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడితే అంతే లోటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని, అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ నాయకుడు చంద్రబాబు రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అందుకు 30 వేల ఎకరాల భూమిని సేకరించారని, సింగపూర్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మాస్టర్ ప్లాన్ వేశారని ఆయన చెప్పారు.

సచివాలయాన్ని కెసిఆర్ ఎర్రగడ్డకు మారుస్తానని చెప్పారని, హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ భవనాలు నిర్మిస్తానని చెప్పారని, వాటిలో ఏదీ జరగలేదని ఆయ న్నారు. ఎపిలో ఆరు నెలల్లో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం జరిగిందని, కెసిఆర్ హుస్సేన్ సాగర్ను ఖాళీ చేసి అందులో మినరల్ వాటర్ నింపుతానని చెప్పారని, కానీ అది జరగలేదని ఆయన అన్నారు.
16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఎపిలో మెట్రో రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, హైదరాబాదులో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభమై 14 ఏళ్లు అవుతోందని, అయినా ఇంకా పిల్లర్ల వద్దే ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్ను నిర్మించడానికి నిజాంకు 200 ఏళ్లు పట్టిందని, సికింద్రాబాదును నిర్మించడానికి బ్రిటిష్ వాళ్లకు 50 ఏళ్లు పట్టిందని, చంద్రబాబు పదేళ్లలో సైబరాబాదును నిర్మించారని ఆయన చెప్పారు.
తాను పుట్టి పెరిగింది హైదరాబాదులోనే అని ఆయన చెప్పారు. తాను కార్యకర్తలతో ఉంటానని చెప్పారు. కెసిఆర్ రోజుకో మాయమాట చెబుతున్నారని ఆయన విమర్శించారు. కెసిఆర్ ఏమీ చేయలేవని తేలిపోయిందని, కెసిఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని ఆయన అన్నారు. కేంద్రంలో మన ప్రభుత్వం ఉందని, తామంతా ఇక్కడే ఉంటామని ఆయన చెప్పారు. జిహెచ్ఎంసి ఎన్నికలు 2019 సాధారణ ఎన్నికలకు నాంది కావాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications