నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి: మదన్ రెడ్డికి ఎంపీ టికెట్!
హైదరాబాద్: మెదక్ జిల్లాలోని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. నర్సాపూర్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన బీఆర్ఎస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో బుధవారం ప్రగతి భవన్లో సునీతా లక్ష్మారెడ్డికి కేసీఆర్ బీ-ఫామ్ అందజేశారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి సునీత బీ-ఫామ్ అందుకున్నారు. ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది.

కాగా, కాంగ్రెస్ పార్టీ తరపున నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సునీతా లక్ష్మారెడ్డి గెలిచారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చిన్న నీటి వనరుల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత రోశయ్య మంత్రివర్గంలో కొనసాగారు. కాగా, 2010లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమం, స్వయం సహాయక సంఘాలు, ఇందిరా క్రాంతి పథం, పింఛన్ల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు.
2004 నుంచి 2009 వరకు శాసనసభ మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్పర్సన్గా కొనసాగారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సునీతా లక్ష్మారెడ్డి.. 2019 ఏప్రిల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా సునీతా లక్ష్మారెడ్డి నియామకం అయ్యారు.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గపడుతుండటంతో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. ఇప్పటికే 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరికొందరు అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. దీంతో అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications