చల్లారని నీట్ మంటలు.. కేంద్రమంత్రి ఇల్లు ముట్టడి
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా రచ్చ కొనసాగుతున్న విషయం తెలిసిందే. యూజీసీ నెట్ పేపర్ లీక్ తో పాటు, నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకల నేపథ్యంలో ఎన్టిఏను రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఇక నీట్ పరీక్షల సెగ హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటికి కూడా తాకింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇల్లు ముట్టడి
నీట్ సమస్యపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరిన విద్యార్థి సంఘాల నాయకులు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. యువజన విద్యార్థి సంఘాల నాయకులు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్, అవకతవకలపై ఎన్టిఏను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా కేంద్ర మంత్రి ఇంటిని ముట్టడించారు.

కిషన్ రెడ్డి ఇల్లు ముట్టడించిన విద్యార్ధి సంఘాల నాయకులు అరెస్ట్
నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. మళ్ళీ తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించగా, పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉంటే నీట్ పరీక్ష మంటలు అటు పార్లమెంటులో కూడా కొనసాగుతున్నాయి.
పార్లమెంట్ లో నీట్ గందరగోళం.. ఇద్దరినీ అరెస్ట్ చేసిన సీబీఐ
ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు 5వ రోజు కొనసాగుతున్న క్రమంలో రెండు సభలలోను నీట్ పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి దీంతో పార్లమెంటు సమావేశాలలోనూ నీట్ కారణంగా గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే నీట్ అక్రమాల కేసులో దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ పాట్నాలో మనీష్ కుమార్, అశుతోష్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది.
నీట్ లీకేజీ కేసులో ఇద్దరు అరెస్ట్
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కి సంబంధించి అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఒకరిని, పరీక్ష ముందు రోజు అంటే మే 4వ తేదీ రహస్యంగా బస చేయడానికి ఏర్పాట్లు చేసిన ఆరోపణలపై మరొకరిని సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. అనంతరం ఈ ఇద్దరినీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.












Click it and Unblock the Notifications