హైదరాబాద్ ప్రథమ పౌరుడు: ఎవరీ బొంతు రామ్మోహన్
హైదరాబాద్: బొంతు రామ్మోహన్.... ప్రస్తుతం ఈ పేరు హైదరాబాద్లో మారు మ్రోగుతోంది. అందుకు కారణం రామ్మోహన్ గురువారం గ్రేటర్ హైదరాబాద్ మహానగర మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ స్థాయికి రావడానికి ఆయన చాలానే కష్టపడ్డారు.
శాకహారి అయిన బొంతు రామ్మోహన్... ప్రజలు, విద్యార్ధులకు అందుబాటులో ఉండటం ఆయన స్వభావం. తెలంగాణ ఉద్యమం, ప్రజా సమస్యలపైనే ఎక్కువ సమయం గడిపారు. బొంతు రామ్మోహన్కు నగరంలోనే కాకుండా రాష్ట్రంలోని 10 జిల్లాల్లో మిత్రులు, అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
Photos: మేయర్ ఎన్నిక సందడి
రామ్మోహన్ స్వస్థలం వరంగల్ జిల్లా మహబూబాబాద్. తండ్రి బొంతు వెంకటయ్య సాధారణ రైతు. తల్లి కమలమ్మ. ఇద్దరు చెల్లెలు మంజు సునీతలు. ఐదో తరగతి వరకు ఆమనగల్లో, ఆపై ఎనిమిది వరకూ నేరడలో చదివిన రామ్మోహన్, మానుకోటలోని కంకరబోడ్ హైస్కూల్ లో 10వ తరగతి, జూనియర్ కాలేజీలో ఇంటర్, వరంగల్ లోని ఆదర్శ కళాశాలలో డిగ్రీ, ఎల్ఎల్బీ చదివారు.
ఆ తర్వాత ఎంఏ, ఎల్ఎల్ఎం, పీహెచ్డీ (పాలిటిక్స్)లో ఉస్మానియా యూనివర్సిటీలో చేరారు. యూనివర్సిటీ ఉండే రోజుల్లోనే చదువు పట్ల చురుగ్గా ఉండే రామ్మోహన్ విద్యార్ధి సంఘాలు, సమస్యలపై స్పందించేవారు. తొలుత బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ కార్యకర్తగా ఉన్నారు.
అప్పట్లో యూనివర్సిటీలో తెలుగులో పరీక్షలు రాసేవారు. ఆ తర్వాత ఇంగ్లీషులో పరీక్షలు రాసేలా మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా పరిధిలోని కళాశాలలో ఉవ్వెత్తున ఉద్యమం చెలరేగింది. ఆ సమయంలో రామ్మోహన్ తనే నాయకుడై అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమించారు.
చివరకు గ్రామీణ ప్రాంతాల వారికి తెలుగులో పరీక్షలు రాసేలా వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత ఏబీవీపీలో చురుకైన నేతగా, విద్యార్ధి నేతగా ఎదిగారు. 2002లో టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆ ఉద్యమాలకు విద్యార్థులను సమీకరిస్తూ, కేసీఆర్కు నమ్మకస్తుడిగా ఎదిగారు.
2005లో విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులై 2007 వరకు పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు టీఆర్ఎస్ కార్యదర్శిగా, విద్యార్ధి విభాగం ఇన్ఛార్జిగా పనిచేశారు. 2009 నుంచి కార్పోరేటర్గా ఎన్నికయ్యేవంతవరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులుగా ఉన్నారు.
తెంలగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లో అత్యధికంగా 12 సార్లు జైలు జీవితం అనుభవించిన వ్యక్తిగా బొంతు రామ్మోహన్ గుర్తింపు పొందారు. బొంతు రామ్మోహన్పై మొత్తం 142కు పైగా కేసులున్నాయి. 12 సార్లు జైలుకు వెళ్లి మొత్తం నాలుగు నెలలు జైలు శిక్షను అనుభవించారు.
ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఉప్పల్ నియోజక వర్గం చర్లపల్లి డివిజన్ నుంచి కార్పోరేటర్ అభ్యర్ధిగా పోటీ చేసి 7,869 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అమీర్పేటకు చెందిన జంగాల శ్రీదేవిని వివాహమాడిన బొంతు రామ్మోహన్కు ఇద్దరు కుమార్తెలు.
మేయర్గా ప్రమాణం స్వీకారం చేయడానికి ముందు తెలంగాణ భవన్లో గురువారం జరిగిన రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశం తరువాత రామ్మోహన్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ మేయర్గా పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు.
తమపై ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేరుస్తామని, నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో హైదరాబాద్ నగరాభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా మార్చడానికి తన వంతు పాత్ర పోషిస్తానన్నారు.