2014 ముఖ్యమంత్రి అభ్యర్థి అసంతృప్తి: బాబుకు ఆర్ కృష్ణయ్య షాక్
హైదరాబాద్: బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య తన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాక్ ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నారు. ఇప్పటికే ఆర్ కృష్ణయ్య టిడిపితో అంటీముట్టనట్లు ఉంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభావం అంతంత మాత్రమేనని చాలామంది భావిస్తున్నారు. అదే సమయంలో ఏపీలో కాపులను బిసిల్లో చేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఆర్ కృష్ణయ్య మండిపడుతున్నారు. కాపులను బిసిల్లో చేర్చితే ఊరుకునేది లేదని చెబుతున్నారు.
ఆర్ కృష్ణయ్య గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి నుంచి ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. అంతేకాదు, తెలంగాణలో టిడిపి అధికారంలోకి వస్తే ఆర్ కృష్ణయ్యని ముఖ్యమంత్రిగా చేస్తామని చంద్రబాబు 2014 ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు.
అలాంటి ఆర్ కృష్ణయ్య పార్టీకి దూరంగా ఉండటమే కాకుండా రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి కొత్త పార్టీ పెట్టి అన్ని పార్టీలకు షాకివ్వనున్నారట. ఆయన ఆధివారం రంగారెడ్డి జిల్లా వికారాబాదులో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని చెప్పారు.
ప్రస్తుతం రాజకీయ పార్టీలు అన్నీ స్వార్థ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కెసిఆర్ అధికారంలోకి వచ్చాక ఆ హామీని మరిచిపోయారన్నారు.
ఇప్పటికేనా తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు, ఏపీలో 1.5 లక్షల ఉద్యోగాలకు ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్నీ స్వార్థ రాజకీయాలకు ప్రాధాన్యమిస్తున్నాయని, కొత్త పార్టీ పెడతానని చెప్పడం ద్వారా ఆర్ కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ పైనా అసంతృప్తితో ఉన్నట్లుగా భావించవచ్చు.