తెలంగాణలో ఎన్ని టెస్టులు చేస్తే.. అన్ని కరోనా కేసులు: మళ్లీ రెండువేలకు పైగా: డిశ్చార్జిల్లోనూ
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో మరోసారి పెరుగుదల చోటు చేసుకుంది. రోజువారీ కరోనా కేసులు మళ్లీ రెండువేల మార్క్ను అందుకున్నాయి. సోమవారం నాడు అధికారులు విడుదల చేసిన బులెటిన్తో పోల్చుకుంటే.. కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకున్నట్టే. కరోనా వైరస్ పరీక్షలను పెంచడం వల్ల దానికి అనుగుణంగా కొత్త కేసులు నమోదు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ.. కరోనా మరణాలను నివారించగలుగుతున్నామని అంటున్నారు.
ఏపీ మంత్రి అవంతికి కరోనా పాజిటివ్: ఆయన కుమారుడికి కూడా, ప్రజలకు సూచనలు
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,058 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించారు. 2,180 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,60,571కి చేరుకుంది. ఇందులో 1,29,187 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 984కు చేరుకుంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 30,400గా నమోదైంది. గృహాలు, ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్లో 23,534 మంది చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 24 గంటల్లో 277 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. సిద్దిపేట్, వరంగల్ అర్బన్ జిల్లాలో కొత్తగా వందకు పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. నల్లగొండ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో వందకు చేరువగా కేసులు రికార్డు అయ్యాయి. జిల్లాలవారీగా ఆదిలాబాద్-20, భద్రాద్రి కొత్తగూడెం-75, జగిత్యాల-52, జనగామ-30, జయశంకర్ భూపాలపల్లి-28, జోగుళాంబ గద్వాల-29, కామారెడ్డి-43, కరీంనగర్-125, ఖమ్మం-103, కొమరంభీమ్ ఆసిఫాబాద్-24, మహబూబ్ నగర్-38, మహబూబాబాద్-68, మంచిర్యాల-41, మెదక్-38, మేడ్చల్ మల్కాజ్గిరి-97, ములుగు-36, నాగర్ కర్నూలు-42, నల్లగొండ-96, నారాయణపేట్-13, నిర్మల్-42, నిజామాబాద్-84, పెద్దపల్లి-48, రాజన్న సిరిసిల్ల-45, రంగారెడ్డి-143, సంగారెడ్డి-24, సిద్ధిపేట్-106, సూర్యాపేట్-62, వికారాబాాద్-24, వనపర్తి-23, వరంగల్ రూరల్-11, వరంగల్ అర్బన్-108, యాదాద్రి భువనగిరి-53 కేసులు నమోదు అయ్యాయి.
కరోనా వైరస్ పరీక్షల జోరు మళ్లీ పెరిగింది. 24 గంటల్లో కొత్తగా 51,811 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 22,20,586కు చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 59,811 పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మరో 908 మంది రిపోర్టులు ఇంకా అందాల్సి ఉందని చెప్పారు.
Recommended Video