పెళ్లింట్లో విషాదం: వివాహమైన రెండో రోజే బాత్రూంలో రక్తపు మడుగులో నవవరుడు
ఖమ్మం: పెళ్లింట్లో విషాదం నెలకొంది. వివాహమైన రెండో రోజే నవ వరుడు ఆత్మహత్య చేసుకోవడంతో అప్పటి వరకు ఎంతో సందడిగా సంబరంగా ఉన్న వాతావరణం విషాదంగా మారిపోయింది. దైవ దర్శనానికి వెళ్దామని కుటుంబసభ్యులందర్నీ సిద్ధం చేసి.. అతను మాత్రం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని వైరా మండలంలో చోటు చేసుకుంది.
ఏపీ యువతితో కమ్మంపాటి నరేశ్కు వివాహం
ఘటనకు సంబంధించి పోలీసుల తెలిపిన వివరాలప్రకారం.. వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన కమ్మంపాటి నరేశ్(29)కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఆర్లపాడుకు చెందిన యువతితో జూన్ 4న వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి వేడుకతో రెండు కుటుంబాలు సంతోషంలో మునిగిపోయాయి. ఆ తర్వాత రోజు ఆదివారం వరుడి స్వగ్రామంలో రిసెప్షన్ నిర్వహించారు. ఆ వేడుకలోనూ నరేశ్ ఎంతో సంతోషంగా గడిపాడు. సహచరులతో కలిసి డ్యాన్స్ కూడా చేశాడు.
బాత్రూంలో బ్లేడుతో కోసుకుని నవవరుడు బలవన్మరణం
ఈ క్రమంలో వధూవరులు, దగ్గరి బంధువులు సోమవారం ఉదయం విజయవాడ సమీపంలోని గుణదలకు దైవదర్శనానికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం నరేశ్ అద్దె కార్లు కూడా మాట్లాడాడు. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి..కుటుంబసభ్యులు, బంధువులందర్నీ లేపాడు నరేశ్. స్నానంచేసి వస్తానంటూ గదిలోకి వెళ్లాడు.
బంధువులు ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బయల్దేరే సమయం వచ్చినా నరేశ్ కన్పించకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్నానాల గది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అయితే, నరేశ్ రక్తపు మడుగులో విగత జీవిగా కన్పించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. బ్లేడుతో చెయ్యి, గొంతు కోసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు.
నవవరుడు అసలేందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?
కాగా, నరేశ్ తల్లి నాగమ్మ ఆశా కార్యకర్త. భర్త నాగేశ్వరరావు కొన్నేళ్ల క్రితమే చనిపోవడంతో ఆమె కుటుంబ భారాన్ని మోస్తున్నారు. కుమార్తె, ఇద్దరు కుమారులను పోషిస్తున్నారు. పెద్ద కుమారుడికి వివాహమైంది. చిన్న కుమారుడు నరేశ్ ఆరేళ్ల క్రితమే బీటెక్ పూర్తిచేశాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. పెళ్లి కుదిరిన నేపథ్యంలో కొద్ది రోజులుగా ఇంటి వద్దనే ఉంటున్నాడు.
పెళ్లికి ముందు, తర్వాత కూడా బంధువులు, సన్నిహితులతో సంతోషంగానే గడిపిన నరేశ్.. ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. అంతా ఇష్టాపూర్వకంగానే జరిగినా నరేశ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా, మృతుని తల్లి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.