హైదరాబాద్ - విజయవాడ టోల్ ఛార్జీలు తగ్గింపు, ఏ వాహనానికి ఎంత..!!
టోల్ రుసుముల ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టోల్ ధరల మార్పుల పైన జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) కీలక ప్రకటన చేసింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పైన టోల్ రుసుముల్లో మార్పులు చేసారు. పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న వాహన దారులకు ఉపశమనం కలిగిస్తూ నిర్ణయించారు. కొత్త ధరలను ఖరారు చేసారు. ప్రయాణించే మార్గానికి అనుగుణంగా ఈ ధరలు నేటి అర్ద్రరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
టోల్ తగ్గింపు
హైదరాబాద్ - విజయవాడ మధ్య జాతీయ రహదారి పై ప్రయాణం చేసే వాహన దారులకు ఎన్హెచ్ఏఐ గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో ఈ అర్ద్రరాత్రి నుంచి టోల్ రుసుము తగ్గనుంది. ఈ మేరకు కొత్త ధరలను ఖరారు చేసారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం, కొర్ల పహాడ్, ఏపీలో చిల్లకల్లు (నందిగామ) వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యానులకు ఒక వైపు ప్రయాణానికి రూ 15, ఇరు వైపులా రూ 30, వాణిజ్య వాహనాలకు ఒక వైపుకు రూ 25 నుంచి రెండు వైపులా కలిపి రూ 40 వరకు తగ్గింపు అమల్లోకి రానుంది.

ధరల మార్పుతో
బస్సు, ట్రక్ లకు ఒక వైపు ప్రయాణానికి రూ 50, ఇరు వైపులా కలిపి రూ 75 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు రూ 5 , ఇరు వైపులా కలిపి రూ 10 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 24 గంటల్లోకా తిరుగు ప్రయా ణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25 శాతం మినహాయింపు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 2026 మార్చి 31 వరకు తాజాగా తగ్గించిన టోల్ ధరలు అమల్లో ఉంటాయని అధికారులు వివరించారు. యాదాద్రి జిల్లా దండు మల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.5 కిలో మీటర్లను జీఎమ్మార్ సంస్థ రూ 1,740 కోట్లతో బీఓటీ పద్దతిలో నాలుగు వరస రహ దారులను నిర్మించింది.
తగ్గించిన ధరలతో
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పై మూడు టోల్ ప్లాజాల వద్ద 2012 డిసెంబర్ లో టోల్ వసూల్లు మొదలు పెట్టారు. 2024 జూన్ 31 వరకు ఆ సంస్థ టోల్ వసూల్లతో పాటుగా రహ దారి పర్యవేక్షణ చేసింది. గత ఏడాది జూలై 1 నుంచి టోల్ వసూళ్లను ఎన్హెచ్ఏఐ ఏజెన్సీల ద్వారా చేపట్టింది. జీఎమ్మార్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్ రుసుములను పెంచుకొనేలా అవకాశం కల్పించారు. ఇప్పుడు ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లను చేపట్టటంతో.. తాజాగా రుసుమును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో... కొత్త ఆర్దిక సంవత్సరం ప్రారంభం అవుతున్న వేళ ఏప్రిల 1 ( ఈ అర్ద్రరాత్రి) నుంచి తాజాగా సవరించిన ధరలు అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications