ఎఫ్బి చాటింగ్: అమెరికా బిజినెస్మ్యాన్ అంటూ అమ్మాయిలకు టోకరా
హైదరాబాద్: నగరంలో నైజీరియన్ల మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సైబర్ క్రైం నేరాల్లో ఆరితేరిన కొందరు నైజీరియన్లు అమాయకులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఫేసుబుక్ చాటింగ్లో అమెరికా పౌరుడిగా బురిడీ కొట్టించి ఓ యువతని మోసం చేసిన నైజీరియన్ను సైబరాబాద్ ఈస్ట్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియా అసాబా ప్రాంతానికి చెందిన ఓమ్లీజ్ ఫ్రెడ్ 2012లో భారత దేశానికి వచ్చాడు. అప్పటి నుంచి ఢిల్లీలోని మెహరౌలీలో నివాసం ఉంటున్నాడు. వీసా గడువు ముగిసినా దానిపై నకిలీ వీసా స్టిక్కర్లను అతికించి మన దేశంలోనే ఉంటున్నాడు ఫ్రెడ్. అంతేగాక, ఫేస్బుక్లో తన ఫొటోకు బదులుగా బెన్సన్ పేరుతో ఓ అందమైన వ్యక్తి ఫొటోను పెట్టి చాలా మందిని ఆకర్షించాడు.
తాను అమెరికా దేశస్థుడినని ఆఫ్ఘానిస్థాన్లో ఉద్యోగం చేస్తున్నట్లు అందులో పేర్కొన్నాడు. ఇటీవల సైబరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువతి అతనికి ఫేసుబుక్లో పరిచయమైంది. ఈ నేపథ్యంలో ఫ్రెడ్.. ఇండియాకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకొని తన వద్ద ఉన్న 5 మిలియన్ డాలర్లు నగదుతో ప్రశాంత జీవనాన్ని సాగించాలనుకుంటున్నానని నమ్మించాడు.

తాను తొందర్లోనే ఇండియాకు వస్తున్నానని అప్పుడే వివాహం చేసుకుందామని యువతితో నమ్మబలికాడు. కాగా, ఓ రోజు ఓ మహిళ ఫోన్ చేసి ఫ్రెడ్ భారీగా అమెరికా డాలర్లు, డైమండ్ రింగ్స్, బంగారం తీసుకువస్తూ న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డాడని ఫోన్ చేసి కట్ చేసింది. ఆ వెంటనే బెన్సన్ ఫోన్ చేసి 'నన్ను విమానాశ్రయంలో పట్టుకున్నారు. నేను తెచ్చిన డబ్బుతో పాటు నేను విడుదల కావాలంటే రెండున్నర లక్షలు డిపాజిట్ చేయాలి' అని అకౌంట్ నెంబరును ఇచ్చాడు.
ఆ మాటలు నమ్మిన యువతి.. ఫ్రెడ్ సూచించిన అకౌంట్లో 2.50లక్షలను డిపాజిట్ చేసింది. ఆ తర్వాత ఫ్రెడ్ అలియాస్ బెన్సన్ ఫోన్ కలవకపోవడంతో మోసపోయానని గ్రహించిన యువతి.. సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ రియాజుద్దీన్ బృందం.. ఫ్రెడ్ అలియాస్ బెన్సన్ను ఢిల్లీలో అరెస్టు చేశారు.

అతని నుంచి 20 సిమ్కార్డులు, 12 మొబైల్ ఫోన్లు, 15 వేల నగదు, 50 వేల ఫోన్ నెంబర్లు, లక్ష ఈమెయిల్ ఐడీల డేటాను స్వాధీనం చేసుకున్నారు. ఈ నైజీరియన్ వేలాది ఫోన్ నెంబర్లను సేకరించి వాటిని బల్క్ ఎస్ఎమ్ఎస్ల కింద లాటరీ ఆఫర్లను ఇచ్చి బోల్తా కొట్టిస్తారని విచారణలో తేలింది. నిందితుడిపై పాసుపోర్టు యాక్ట్ కింద కేసును నమోదు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ తెలిపారు.












Click it and Unblock the Notifications