Telangana: చికెన్ తింటున్నారా జాగ్రత్తగా.. ఫారం కోళ్లలో భయంకరమైన బ్యాక్టీరియా..!
చాలా మంది నాన్ వెజిటేరియన్లకు చికెన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. చాలా మంది చికెన్ లో అనేక వెరైటీలు తింటుంటారు. అయితే ఇక నుంచి చికెన్ తినేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బాయిలర్ కోళ్లలో భయంకరమైన బ్యాక్టీరియా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. తెలంగాణ, కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లలో యాంటీ బయాటిక్ ను తట్టుకునే బ్యాక్టీరియా పెరుగుతోందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ (ఎన్ఐఎన్) సైంటిస్టులు హెచ్చరించారు. చికెన్ తినేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
చాలా మంది పౌల్ట్రీ ఫామ్స్ వాళ్లు అవసరమున్నా లేకపోయినా కోళ్లకు యాంటీ బయాటిక్ ఇంజక్షన్లు ఇస్తున్నారు. దీంతో కోళ్లలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కోళ్ల మాంసం తింటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. అందుకే మాంసాన్ని బాగా ఉడికించాలని చెబుతున్నారు. అయినప్పటికీ జాగ్రత్త అవసరమని చెబుతున్నారు. ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు కేరళను సౌత్ జోన్ గా, తెలంగాణను సెంట్రల్ జోన్ గా విభజించి ఈ అధ్యయనం నిర్వహించారు.

రెండు రాష్ట్రాల్లోని 47 పౌల్ట్రీఫామ్స్ లోని 131 శాంపిళ్ల(కోడి రెట్టల)ను సేకరించారు. వాటి నుంచి డీఎన్ఏను వేరు చేసి పరిశోధించారు. పరిశోధనలో కోళ్లలో భయంకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని తేల్చారు. కోళ్ల రెట్టలో విరేచనాలకు కారణమయ్యే ఈకోలి, చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెఫిలోకాకస్ ఆరియస్తో పాటు క్లాస్ట్రిడియం పెర్ఫ్రింజెన్స్, క్లేబ్సియెల్లా ఎంటరోకోకస్ ఫెకాలిస్, సూడోమోనాస్ ఎరుగినోసా, బాక్టీరియోడ్స్ ఫ్రాజిల్స్ వంటి హానికరమైన బ్యాక్టీరియా కు సంబంధించి ఆనవాళ్లు ఉన్నట్లు తేల్చారు.
ఈ బ్యాక్టీరియా మానల శరీరంలోకి ప్రవేశిస్తే వ్యాధులు వస్తాయని హెచ్చరించారు. ఈ బ్యాక్టీరియాలన్నీ యాంటీ బయాటిక్ ట్రీట్ మెంట్ కు సవాల్ విసురుతాయని హెచ్చరించారు. ఇలాంటి చికెన్ ను అధిక ఉష్ణోగ్రతలో ఉడికించడం ద్వారా వీటిలో 95 శాతం బ్యాక్టీరియా నాశనమవుతుందని వివరించారు. తెలంగాణతో పోలిస్తే కేరళలోనే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) జన్యువు తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. సో ఫారం కోళ్లు తినడం మంచి కాదని తెలిసినా.. చాలా మంది తినకుండా లేకపోతున్నారు. ఒక వేళ తిన్నా బాగా ఉడికించి తినండి.












Click it and Unblock the Notifications