రైతును రాజు చేయడం కాంగ్రెస్ వల్ల కాదు.!చేతనైతే రాహుల్ బీజేపీపై యుద్ధం చేయాలన్న నిరంజన్ రెడ్డి.!
హైదరాబాద్ : రాహుల్ గాంధీ వరంగల్ రైతు సంఘర్షణ సభ డిక్లరేషన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్మితే 2014, 2018లో కాంగ్రెస్ పార్టీని ఇక్కడి ప్రజలు ఎందుకు ఓడించారని నిరంజన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది లేదు, టీఆర్ఎస్ తీసుకున్నది లేదని, ఎనలేని త్యాగాలతో కేంద్రం మెడలు వంచి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారని నిరంజన్ రెడ్డి స్పష్టం చేసారు.

కాంగ్రెస్ వి ప్రగల్బాలు మాత్రమే.. కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అన్న నిరంజన్ రెడ్డి
2004లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో భాగంగా రాష్ట్రపతి ద్వారా తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ప్రకటింపజేయకుండా పదేండ్లు తాత్సారం చేసిన కాంగ్రెస్ మూల్యం చెల్లించుకుందని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల కథ భాగోతం సీబీసీఐడీ విచారణలో తేలిపోయిందని, కట్టని ఇండ్లకు బిల్లులు ఎత్తిన మాయాజాలం కాంగ్రెస్ పార్టీదని పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీ కాంగ్రెస్ ఇచ్చిందని, అయినా ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు మళ్లీ అదే పాత పాట పాడుతున్నదని నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేసారు.

వరంగల్ డిక్లరేషన్ ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలి.. డిమాండ్ చేసిన వ్యవసాయ మంత్రి
అంతే కాకుండా రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం 15 వేల రూపాయలు అందిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని, ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దానిని వెంటనే అమలు చేయాలని సవాల్ విసిరారు నిరంజన్ రెడ్డి. రైతులకు సరయిన ధర నిర్ణయం కోసం నిర్దేశించిన స్వామినాధన్ కమీషన్ వేసింది యూపీఏ ప్రభుత్వమని, ఆ కమిటీ సిఫారసులను తుంగలో తొక్కిందికూడా యూపీఏ ప్రభుత్వమేనని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని నీరుకార్చింది కాంగ్రెస్ కాదా.? సూటిగా ప్రశ్నించిన నిరంజన్ రెడ్డి
తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించడం కాదని, ఆ పరిశ్రమలు మూతపడింది కాంగ్రెస్ హయాంలోనేనని, వాటి అమ్మకానికి శ్రీకారం చుట్టింది కూడా యూపీఎ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే వ్యవహారాన్ని ఇప్పుడు బీజేపి ప్రభుత్వం కోనసాగిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు భీమా పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో వెంటనే అమలు చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా అని నిరంజన్ రెడ్డి నిలదీసారు. ఉపాధి హామీ పథకంతో వ్యవసాయానికి మనుషులు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నారు నిరంజన్ రెడ్డి.

కేసీఆర్ సుపరిపాలన.. తెలంగాణ సస్యశ్యామలంగా మారిందన్న నిరంజన్ రెడ్డి
తెలంగాణలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రజా సంక్షేమ చర్యలు, టీఆర్ఎస్ సుపరి పాలన ఫలితంగా ఎనిమిదేళ్లలో 80 లక్షల అదనపు ఆయకట్టు వచ్చిందని, మరో 20, 25 లక్షల ఆయకట్టు రాబోతుందని స్పష్టం చేసారు. నిన్నటి వరకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో ఈ హామీలు ఎందుకు ఇవ్వలేదని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసారు. అసలు శతృవును, యుద్దరంగాన్ని వదిలి మరోచోట ప్రగల్భాలు పలకాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎందుకని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications