2 కిలోమీటర్లు నడిచి, చేలో మంచె పైకెక్కి.. ఆన్ లైన్ క్లాసులు వింటున్న విద్యార్థినికి అండగా..
కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం డిజిటల్ విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తోంది. దేశవ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా విద్యార్థులకు విద్యా బోధన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేసింది. అయితే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ విద్యా బోధన సాధ్యంకాని పరిస్థితి ఉంది. మారుమూల గ్రామాలలో ఇప్పటికీ నెట్వర్క్ సమస్యలు ఉన్న కారణంగా విద్యార్థులు పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఆన్ లైన్ విద్యా విధానంతో మారుమూల ప్రాంత విద్యార్థులకు పడరాని పాట్లు
తెలంగాణ రాష్ట్రంలో సైతం ఆన్లైన్ విద్యావిధానానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి టీ శాట్ ద్వారా ఆన్లైన్ తరగతుల నిర్వహణ మొదలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అయితే చాలా మారుమూల ప్రాంతాలలో విద్యార్థులు ఆన్లైన్ విద్యా విధానానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల పాఠాలను వినటం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఓ విద్యార్థిని ఆన్లైన్ తరగతుల ద్వారా విద్యను నేర్చుకోవడం కోసం రెండు కిలోమీటర్లు నడిచి వెళ్తోంది.

పంట చేలోకి వెళ్లి మంచె పైకెక్కి నిర్మల్ జిల్లా విద్యార్థిని డిజిటల్ క్లాసుల తిప్పలు
పంట చేలోకి వెళ్లి మంచె ఎక్కితేనే తప్ప సిగ్నల్ రాని పరిస్థితి . విషయం తెలిసిన ఒక ప్రముఖ టెలికాం సంస్థ ఆ విద్యార్థికి కావలసిన నెట్ వర్క్ కోసం సెట్ టాప్ బాక్స్ ను ఉచితంగా అందించింది. డిజిటల్ తరగతులను వినడం కోసం, విద్య నేర్చుకోవడం కోసం ఆ విద్యార్థినికి సహకరించింది సదరు టెలికాం సంస్థ.
నిర్మల్ జిల్లాలోని రాజుర గ్రామానికి చెందిన పన్నెండేళ్ల సఫా జరీన్ ఏడవ తరగతి చదువుతోంది. కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు లేకపోవడంతో ఆన్లైన్లో విద్యను నేర్చుకోవడం కోసం ప్రతిరోజు రెండు కిలోమీటర్ల మేర నడిచి వెళుతూ వారి వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటుంది. ఉదయం 11 గంటలకు తమ పంట పొలంలో ని మంచె పైకి ఎక్కి పాఠాలు వింటుంది.

అండగా నిలిచిన ప్రముఖ టెలికాం సంస్థ
అక్కడ మాత్రమే సిగ్నల్స్ వస్తుండడంతో ప్రతిరోజు సఫా జరీన్ అక్కడికి వెళ్లి డిజిటల్ తరగతుల ద్వారా విద్య నేర్చుకుంటుంది. ఈ విషయం తెలిసిన ఓ ప్రముఖ టెలికాం సంస్థ, సదరు విద్యార్థికి కావలసిన ఇంటర్నెట్ సదుపాయం తోపాటు, సెట్ టాప్ బాక్స్ ను అందించారు.
తన చదువును కొనసాగించడం కోసం సహాయం చేసిన సదరు సంస్థకు కృతజ్ఞతలు తెలిపింది సఫా జరీన్. ఇప్పుడు తనతో పాటు తన స్నేహితులు కూడా తన ఇంట్లోనే ఆన్లైన్ తరగతులకు హాజరు అవుతారని సంతోషంగా చెప్తోంది ఆ విద్యార్థిని.

సఫా జరీన్ లా ఇబ్బంది పడుతున్నవారెందరో .. ప్రభుత్వం దృష్టి పెట్టాలి
ఒక్క సఫా జరీన్ మాత్రమే కాదు ఆమెలా ఎంతో మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు వినే సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. చెట్లెక్కి, గుట్టలెక్కి , వేరే చోట్లకు వెళ్లి క్లాసులు వినేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇక వీరందరి పై ప్రభుత్వం దృష్టి సారించి వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే, మారుమూల ప్రాంతాల నిరుపేద విద్యార్థులకు మేలు చేసినట్లవుతుంది.
డిజిటల్ విద్యా విధానం గ్రామీణ స్థాయిలో కూడా విద్యార్థులకు చేరినప్పుడే ప్రయోజనకరంగా ఉంటుంది .












Click it and Unblock the Notifications