నా చెల్లిని దారుణంగా చంపేశారు, వారిని వదలొద్దు: చాందిని సోదరి నివేదిత
హైదరాబాద్: తన చెల్లిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన నిందితులను వదిలి పెట్టవద్దని, కఠినంగా శిక్షించాలని చాందినీ జైన్ సోదరి నివేదిత జైన్ డిమాండ్ చేశారు. కుట్రపూరితంగానే కిడ్నాప్ చేసి ఈ హత్యకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. నగరంలో గత శనివారం (సెప్టెంబర్ 9న) అదృశ్యమైన వ్యాపారవేత్త కిశోర్ జైన్ కుమార్తె, ఇంటర్ విద్యార్థిని చాందినీని దుండగులు హత్య చేసి మదీనగూడ సమీపంలోని కొండల్లో పడేశారు.
చాందినీ మరణంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు ఎవరితోనూ వివాదాలు లేకున్నా.. తన చెల్లిని కుట్రపూరితంగానే హత్య చేశారని నివేదిత ఆరోపించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 9న కాలేజీ నుంచి ఇంటికొచ్చిన చాందిని.. సాయంత్రం ఐదున్నర గంటలకు స్నేహితుల ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లిందని తెలిపారు.
పార్టీకని వెళితే దారుణం: ఇంటర్ విద్యార్థినిని హత్య చేసి కొండల్లో పడేశారు
సుమారు గంట తర్వాత చెల్లికి ఫోన్ చేస్తే ఆమె మొబైల్ స్విఛ్ఛాఫ్ వచ్చిందని చెప్పారు. అనుమానం రావడంతో చాందిని కోసం బంధువులు, చెల్లి స్నేహితుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోయిందన్నారు. చాందిని అదృశ్యంపై ఆదివారం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చాందినీ హత్యకు గురైందని తమకు మంగళవారం సమాచారం అందించారని నివేదిత తెలిపారు. తమ చెల్లిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నివేదిత పోలీసులను కోరారు. కాగా, చాందినీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
'మై హార్ట్' పేరుతో కాంటాక్ట్
కాగా, చాందిని మొబైల్ ఫోన్లో 'మై హార్ట్' పేరుతో ఓ కాంటాక్ట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ కాంటాక్టుకు చాందిన పదే పదే మాట్లాడినట్లు తెలిసింది. దీంతో తెలిసిన వ్యక్తులే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.