భార్యకు సినిమాల్లో అవకాశాల్లేక, అలా కోట్లు దోచారు
హైదరాబాద్: గొలుసుకట్టు మోసాల కేసులో పరారీలో ఉన్న సురేఖ అనే మహిళ తొలుత సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాదుకు వచ్చింది. సినిమాల కార్యాలయాల చుట్టూ తిరిగింది. బుల్లి తెరపైన తనను తాను చూసుకోవాలని ఆరాటపడింది. అవకాశం దొరకక పోవడంతో డబ్బు సంపాదిస్తే గానీ తాము అనుకున్న పని సాధ్యం కాదని భావించింది.
పెట్టుబడి పెడితే అధిక కమిషన్
పెట్టుబడి పెడితే ఎక్కువ కమిషన్ ఇస్తామని చెప్పి భార్య సురేఖ, ఆమె భర్త శ్రీనివాస రావులు పలువురి నుండి కోట్ల రూపాయలు వసూలు చేశారు. వీరి బాధితుల సంఖ్య చాలానే ఉందని తెలుస్తుంది. నిందితులు తమకు సినిమా అవకాశాలు రాకపోవడంతో మోసాల వైపు మళ్లారని సమాచారం.
ఈ కేసులో భరత్ శ్రీనివాస రావును బంజారాహిల్స్ పోలీసులు రిమాండుకు పంపించారు. భార్య సురేఖ మాత్రం పరారీలో ఉంది. సురేఖ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది. కానీ ఫలించలేదు. దీంతో భార్యాభర్తలు ఇద్దరు కలిసి గొలుసుకట్టు వ్యాపారానికి తెరతీశారని తెలుస్తోంది.
సురేఖకు సంబంధించిన కొన్ని చిత్రాలను పోలీసులు బాధితులకు అందించారు. మోసపోయిన వారిలో ఓ ప్రయివేటు సంస్థ మేనేజర్తో పాటు, ఓ వైద్యుడు మరికొందరు ఉన్నారు. సురేఖ, శ్రీనివాస రావు దంపతులు దాదాపు రూ.10 కోట్ల మేర వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. వారు గ్రీన్ వాల్ట్ గ్లోబ్ సంస్థ పేరుతో ఈ అక్రమాలకు పాల్పడ్డారు.