Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ కు ప్ర‌త్యామ్నాయం ఎన్డీయేలో చేరడ‌మేనా..?

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు పేరుతో గత కొంత కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ కొత్త కూటమికి పురుడుపోసే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఈ ఫ్రంట్ ఉంటుందని ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషించేలా తన కలల ఫ్రంట్ ఉంటుందని చెబుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, డీఎంకే అధినేత కరుణానిధి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, సమాజ్ వాది నాయకుడు అఖిలేష్ యాదవ్ తో కేసీఆర్ ఇప్పటికే చర్చలు జరిపారు. కర్నాటక ఎన్నికల హడావుడి సమయంలో సడెన్ గా బెంగుళూరు వెళ్లి జేడీఎస్ అధినేత దేవేగౌడతో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగువాళ్లంతా ఎన్నికల్లో జేడీఎస్ కు మద్ధతివ్వాలని కోరారు. కేసీఆర్ మొదలు పెట్టిన ఈ ఫ్రంట్ తతంగం వెనుక బీజేపీ ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. మోడీ అండ్ కో సూచనల మేరకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు మొదలు పెట్టారని రాజకీయవర్గాల్లో ప్రచారం ఉంది.

మోడీ, షాలు తెర వెనుక కథ నడుపుతున్నారన్న అనుమానాలు..

మోడీ, షాలు తెర వెనుక కథ నడుపుతున్నారన్న అనుమానాలు..

కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ భాగస్వామ్య పక్షాలను చీల్చి, కాంగ్రెస్ ను బలహీనపరిచే వ్యూహంలో భాగంగానే ఫెడరల్ ఫ్రంట్ ఎత్తుగడ వేశారన్న అభిప్రాయం ఉంది. యూపీఏ భాగస్వామ్య పార్టీలు మోడీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరే అవకాశం లేదు. కనుక, వారితో ప్రత్యేకంగా ఓ ఫ్రంట్ ఏర్పాటైతే... అది అంతిమంగా బీజేపీకి లాభం అవుతుందన్న అంచనాతో ఫెడరల్ ఫ్రంట్ తెర మీదకు వచ్చిందన్న సందేహాలు ఉన్నాయి. దీని కోసం కేసీఆర్ ను ముందు పెట్టి... మోడీ, షాలు తెర వెనుక కథ నడుపుతున్నారన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో ఉన్నాయి. ఫ్రంట్ పేరుతో కేసీఆర్ ఇప్పటి వరకు కలిసిన వారు కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలే కావడం గమనార్హం. గవర్నర్ నరసింహన్ ద్వారా ఫ్రంట్ కు సంబంధించి కేసీఆర్ కు మోడీ అండ్ కో దిశానిర్దేశం చేస్తోందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారు కొలువుదీరబోతోంది. ముఖ్యమంత్రిగా జేడీఎస్ నాయకుడు కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. దీనికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా పలు యూపీఏ భాగస్వామ్యపక్షాలు హాజరవుతున్నాయి.

కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరయ్యే విషయం పై టీఆర్ఎస్ లో తర్జనభర్జనలు..

కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరయ్యే విషయం పై టీఆర్ఎస్ లో తర్జనభర్జనలు..

తాజాగా ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా కాంగ్రెస్ అధినేతలతో కలిసి తొలిసారి వేదిక పంచుకోబోతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ చర్చలు జరిపివచ్చిన మమతా బెనర్జీ కూడా ఈ వేడుకకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరయ్యే విషయం పై టీఆర్ఎస్ లో తర్జనభర్జనలు జరిగాయి. ఈ వేడుకకు వెళితే ఓ బాధ, వెళ్లకపోతే ఓ బాధ అన్న సంకట స్థితిని టీఆర్ఎస్ ఎదుర్కుంది. మధ్యేమార్గంగా వేడుకకంటే ముందే కేసీఆర్ బెంగుళూరు వెళ్లి కుమార స్వామిని కలిసి శుభాకాంక్షలు చెప్పి వచ్చేశారు.

 కాంగ్రెస్ తో కలిసి వేదిక పంచుకునే పరిస్థితి కేసీఆర్ కు లేదు..

కాంగ్రెస్ తో కలిసి వేదిక పంచుకునే పరిస్థితి కేసీఆర్ కు లేదు..

బుధవారం బిజీ షెడ్యూల్ ఉన్నందునే ప్రమాణస్వీకారాని కంటే ముందే కుమారస్వామిని కలిసి శుభాకాంక్షలు చెప్పి వచ్చామని టీఆర్ఎస్ చెబుతోంది. కేసీఆర్ నిజంగా బిజీగా ఉంటే తన తరఫున టీఆర్ఎస్ ప్రతినిధి బృందాన్ని ప్రమాణస్వీకార వేడుకకు పంపవచ్చు. కానీ, కాంగ్రెస్ తో కలిసి వేదిక పంచుకునే పరిస్థితి కేసీఆర్ కు లేదు. రాష్ట్రంలో ఆ పార్టీనే కేసీఆర్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. 2019 ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే పోరు జరగబోతోంది. ఈ నేపథ్యంలో తన పాత్ర, ప్రమేయం లేకుండా బెంగుళూరు వేదికగా జరగబోతోన్న కుమార స్వామి ప్రమాణస్వీకారం కేసీఆర్ కు మింగుడుపడని విషయమే. తను కలలు కంటోన్న ఫ్రంట్ కు ఈ వేడుక ప్రతిబంధకమే. కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఉండాలనుకున్న కేసీఆర్ ఆలోచనలకు వ్యతిరేకంగా ఈ వేడుక జరగబోతోంది. వాస్తవానికి ఇది కుమార స్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే వేడుకగా మాత్రమే చూడలేం.

మోడీ వ్యతిరేక శక్తులన్నీ ఓకే వేదిక మీదకు..

మోడీ వ్యతిరేక శక్తులన్నీ ఓకే వేదిక మీదకు..

దేశ రాజకీయాలకు ఈ వేదిక నుంచి ఓ సంకేతం వెళ్లబోతోంది. మోడీ వ్యతిరేక శక్తులన్నీ ఓకే వేదిక మీదకు రాబోతున్నాయి. దానికి కాంగ్రెస్ కేంద్ర బిందువుగా ఉండబోతోంది. మరో కీలక నేత చంద్రబాబు నాయుడు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండబోతున్నారు. మోడీ వ్యతిరేక శక్తుల ఐక్యవేదికగా ఇది ఉండే అవకాశం ఉంది. ఈ కలయిక భవిష్యత్తులో ఏ రూపు సంతరించుకుంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. మోడీ వ్యతిరేక కూటమికి కాంగ్రెస్ సారథ్యంలో పడుతోన్న తొలి అడుగుగా దీనిని కచ్చితంగా భావించొచ్చు. ఈ సందర్భంలో కేసీఆర్ ది సంకట పరిస్థితి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతోన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఆశల పై ఈ వేడుక నీళ్లు చల్లిందనే చెప్పాలి. ఓ రకంగా దేశ స్థాయిలో కేసీఆర్ ఇప్పుడు ఒంటరిగా మిగిలారు. ఆయనకు బీజేపీ రహస్య మిత్రుడుగా ఉంటే వుండవచ్చు. కానీ, తెర మీద చిత్రంలో మాత్రం ఈ రోజు ఆయన ఏకాకి. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఓ గారడీగా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ అస్థిత్వంలోకి రాకుంటే జాతీయ స్థాయిలో కేసీఆర్ ఎవరివైపు అన్న ప్రశ్న వస్తుంది. కాంగ్రెస్ సారథ్యంలోని ఫ్రంట్ లో కేసీఆర్ చేరలేరు. అలాగని, ఆయన చెబుతోన్న ఫెడరల్ ఫ్రంట్ కష్టమే. అప్పుడు కేసీఆర్ కు జాతీయ స్థాయిలో మిగిలే ఏకైన ఆప్షన్ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మాత్రమే!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+