బీజేపీలో చేరిక ఎఫెక్ట్: భువనగిరి మున్సిపల్ ఛైర్పర్సన్ లావణ్యపై అవిశ్వాసం
భువనగిరి: భువనగిరి పురపాలక ఛైర్ పర్సన్ సుర్వి లావణ్యపై కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ అనితా రామచంద్రన్కు బుధవారం అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీల కౌన్సిలర్లు బుధవారం పత్రాన్ని అందజేశారు.

అవిశ్వాసానికి అన్ని పార్టీల మద్దతు!
పులిపాలికలో మొత్తం 30మంది కౌన్సిలర్లు ఉండగా, ఇందులో 24మంది అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేశారు. వీరిలో 15మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు కాగా, నలుగురు కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముగ్గురు, టీడీపీ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

కలెక్టర్ నోటీసులు
ఈ నేపథ్యంలో నెలరోజుల్లోగా అవిశ్వాసంపై సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. 15పనిదినాల్లో వారందరికీ నోటీసులు అందిస్తామని చెప్పారు. ప్రజా విశ్వాసం కోల్పోయినందునే ఛైర్ పర్సన్పై అన్ని పక్షాలు కలిసి అవిశ్వాన్ని ప్రతిపాదించినట్లు టీఆర్ఎస్ నేత సుధాకర్ తెలిపారు.

బీజేపీ తీర్థం పుచ్చుకున్న లావణ్య
కాగా, గత ఐదు రోజుల క్రితమే ఛైర్ పర్సన్ లావణ్య టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతోపాటు పట్టణ 7వ వార్డు కౌన్సిలర్ ఎలిగల నరేష్ కూడా బీజేపీలో చేరారు.

బీజేపీ-టీఆర్ఎస్-బీజేపీ
అయితే, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచే కౌన్సిలర్గా లావణ్య ఎన్నికయ్యారు.
బీజేపీ, టీడీపీ కూటమి పొత్తులో భాగంగా లావణ్య భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆమె మంత్రి జగదీష్రెడ్డి సమక్షంలో అధికార టీఆర్ఎస్లో చేరారు. అయితే ఆరు మాసాల క్రితమే అధికార టీఆర్ఎస్ నాయకులతో విభేదించిన చైర్పర్సన్ లావణ్య తన సొంతగూటికి చేరే యత్నం చేశారు. ఇటీవల చేపట్టిన జనచైతన్య యాత్రలో భాగంగా షాద్నగర్ వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు.












Click it and Unblock the Notifications