డాడీతో విభేదాల్లేవు: కెసిఆర్ తనయుడు కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ విషయంలో తనకు, నాన్నకు మధ్య విభేదాలు పొడసూపినట్లు మీడియాలో వస్తున్న వార్తలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయుడు, రాష్ట్ర మంత్రి కెటి రామారావు తోసిపుచ్చారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తొలి తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఎలాంటి అభిప్రాయబేధాలు లేవన్నారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే అనుభవజ్ఞులైన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోరుకునే ప్రభుత్వమని ఆయన చెప్పారు. ఉద్యోగులు కాస్తా ఓపిక పడితే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. ఉద్యోగులకు అండగా ఉండే బాధ్యత తమదన్నారు. సమస్యల పరిష్కారంలో కాస్త ఆలస్యం తప్పదని చెప్పారు పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఉద్యోగులను కోరారు.
ఉద్యోగులు ఎలాంటి అక్రమాలు, అవినీతికి పాల్పడవద్దని అన్నారు బంగారు తెలంగాణ కోసం ఉద్యోగులంతా నడుం బిగించాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. డీఏ, బీమా, ప్రత్యేక ప్రోత్సహకాల గురించి యోచిస్తున్నామని చెప్పారు. తాము హామీ ఇచ్చామంటే తప్పకుండా ఆచరించి చూపిస్తామని చెప్పారు.
కాగా, మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి కెటిఆర్ హాజరు కాలేదు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు. దీంతో కెసిఆర్ చేపట్టిన మంత్రివర్గ విస్తరణపై కెటిఆర్ అలిగినట్లు వార్తలు వచ్చాయి. అంతే కాకుండా, ఆ తర్వాత మరోమారు జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన దూరంగానే ఉన్నారు. దీంతో తండ్రీకొడుకులకు మధ్య దూరం పెరిగినట్లు ప్రచారం సాగింది.