దారుణం.. చిమ్మ చీకట్లో పొలంలో ఒంటరిగా కరోనా పేషెంట్... గ్రామంలోకి అడుగుపెట్టనివ్వకపోవడంతో...
కరోనా బాధితుల పట్ల వివక్ష చూపించకూడదని అధికార యంత్రాంగం ఎంతలా మొత్తుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వైరస్ సోకినవారి పట్ల కొన్నిచోట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వారిని కనీసం గ్రామంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడలోనూ ఇదే తరహా ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... సాలేగూడకు చెందిన మడావి సోన్దేవి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇటీవల ఆమె కరోనా బారినపడటంతో స్వగ్రామంతో సాలేగూడకు వచ్చింది. సోన్దేవీకి కరోనా సోకినట్లు అప్పటికే ఊరంతా తెలియడంతో గ్రామస్తులు ఆమెను అడ్డుకున్నారు. కరోనా నుంచి కోలుకునేంతవరకు గ్రామంలోకి రావొద్దని తేల్చి చెప్పారు. దీంతో నిస్సహాయ స్థితిలో సోన్దేవి తల్లిదండ్రులు ఆమెను తమ పొలంలోని పందిట్లో ఉంచుతున్నారు.
గత కొద్దిరోజులుగా సోన్దేవి ఒంటరిగా అక్కడే ఐసోలేషన్లో ఉంటోంది. విషయం తెలుసుకున్న ఏటీడబ్ల్యూఓ క్రాంతికుమార్,గురుకులం ఆర్సీఓ గంగాధర్ సోమవారం(మార్చి 29) పొలం వద్దకు వెళ్లి ఆమెను పరామర్శించారు. బాలికను గ్రామంలోకి అనుమతించాలని గ్రామస్తులతో,పంచాయతీ పెద్దలతో మాట్లాడారు.

రాత్రి 8గంటల వరకు వారితో చర్చించినా ఎటువంటి లాభం లేకపోయింది. మరో నాలుగు రోజులైతే క్వారెంటైన్ పూర్తవుతుందని... అప్పుడే ఆమె గ్రామంలోకి రావాలని గ్రామస్తులు తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు. ప్రస్తుతం ఆ యువతి పొలంలోనే ఒంటరిగా గడపాల్సి వస్తోంది. పగటిపూట పెద్దగా భయం లేకపోయినా... రాత్రిపూట చిమ్మటి చీకట్లో అక్కడ ఒంటరిగా గడపడం భయాందోళనకు గురిచేస్తున్నట్లు యువతి వాపోయిందని తెలుస్తోంది.
గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. గత రెండు,మూడు రోజులుగా ఐదు వందలకు అటు,ఇటుగా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం(మార్చి 29) రాష్ట్రంలో 33,930 పరీక్షలు నిర్వహించగా 403 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఆదివారం(మార్చి 28) 535 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,06,742కి చేరింది. గడిచిన 24గంటల్లో కరోనాతో మరో ఇద్దరు మృతి చెందడంతో..ఇప్పటి వరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1690కి చేరింది.
తాజాగా మరో 313 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 3,00,469కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,583 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. వీరిలో 1,815 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. టెస్టుల విషయానికి వస్తే ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,00,53,026 కొవిడ్ టెస్టులు నిర్వహించారు.












Click it and Unblock the Notifications