తెలంగాణలో ఎగబడి మద్యం కొనాలంటే కష్టమే: మందుబాబుల బెండు తీసేలా: చీప్ లిక్కర్ కూడా కాస్ట్లీ
హైదరాబాద్: తెలంగాణలో మరి కాస్సేపట్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులను తెరవడానికి కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెడ్జోన్లలో కూడా మద్యం అమ్మకాలను ప్రారంభించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఒక్క కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే మినహాయింపునిచ్చింది. కంటైన్మెంట్ క్లస్టర్లలో మద్యం అమ్మకాలు ఉండవు. ఇప్పుడున్న పరిస్థితులను యధాతథంగా కొనసాగిస్తారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఈ ఉదయం 10 గంటలకు మద్యం షాపులు తెరచుకోబోతున్నాయి.

నో మాస్క్.. నో లిక్కర్..
కరోనా వైరస్ సంక్రమించడాన్ని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ వల్ల దాదాపు 44 రోజుల తరువాత మద్యం షాపులు తెరచుకోవడం వల్ల మద్యం ప్రియులు ఏ రేంజ్లో ఎగబడ్డారో చూశాం. ఒకరినొకరు తోసుకుంట.. తన్నుకుంటూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా లిక్కర్ షాపుల వద్ద బారులు తీరిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. తెలంగాణలో ఈ తరహా వాతావరణం కనిపించకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. మాస్క్ ఉంటేనే మద్యాన్ని అమ్ముతామనే నిబంధనను పక్కాగా అమలు చేయనుంది. సోషల్ డిస్టెన్సింగ్ను తప్పనిసరి చేసింది.

16 శాతం పెంపు..
మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం 16 శాతం మేర ధరలను పెంచింది. భారత్లో తయారైన విదేశీ మద్యం, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న లిక్కర్పైనా 16 శాాతం పన్ను రేటును వర్తింపజేసింది. చీప్ లిక్కర్పైనా రేటును పెంచింది తెలంగాణ ప్రభుత్వం. చీప్ లిక్కర్పై 11 శాతం మేర ధరలను పెంచింది. ఏపీ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఇప్పటికే మద్యం అమ్మకాలపై పన్నులను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ కూడా ఆ రాష్ట్రాల జాబితాలో చేరింది. బుధవారం నుంచి పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. బార్లు, పబ్బులు, క్లబ్బుల్లో మద్యం అమ్మకాలపై నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పొరుగు రాష్ట్రాలతో పాటు..
లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఆరంభమైన విషయం తెలిసిందే. తెలంగాణతో సరిహద్దులను పంచుకుంటోన్న అన్ని రాష్ట్రాల్లోనూ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ చుట్టూ ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్లల్లో సోమవారం నుంచే లిక్కర్ అమ్మకాలు ఆరంభం అయ్యాయి. సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి తెలంగాణలోనూ వాటి అమ్మకాలను పునఃప్రారంభించాల్సి ఉంటుందనే నిర్ణయాన్ని తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.
Recommended Video

నిత్యావసర సరుకుల వెళ్లినా మాస్క్ తప్పనిసరి..
నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడానికి వెళ్లినా.. మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఇక్కడ కూడా నో మాస్క్.. నో గూడ్స్ విధానాన్ని అమలు చేయనుంది. ప్రతి దుకాణం ముందూ ముగ్గులను పోయాల్సి ఉంటుందని, మాస్క్ లేకపోతే నిత్యావసర సరుకులను కొనుగోలుదారుడికి విక్రయించకూడదని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల వద్ద కూడా ఇదే నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. మాస్క్ లేని కార్డుదారులను వెనక్కి పంపించాలంటూ ఇదివరకే రేషన్ డీలర్లకు ఆదేశాలను జారీ చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications