నేను మీకు హామీ ఇస్తున్నా.. ఎన్ఆర్సీపై తెలంగాణ హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
లోక్సభలో జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్ఆర్సీ) బిల్లుపై ఓటింగ్కు టీఆర్ఎస్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇంతవరకు ఈ చట్టంపై ఎక్కడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో హోంమంత్రి మహమూద్ అలీ మాత్రం తెలంగాణలో ఎన్ఆర్సీ అమలుచేయబోమని తాజాగా స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు గురవుతున్న హిందువులకు భారతదేశంలో పౌరసత్వం కల్పించవచ్చునని, కానీ పౌరసత్వం పేరుతో దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేయకూడదని అన్నారు. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మహమూద్ అలీ మాట్లాడారు.
ఇటీవలే కేంద్రమంత్రిని కలిసిన మహమూద్ అలీ :
ఇటీవల కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీని కలిసినప్పుడు ఇదే విషయాన్ని ఆయనతో చెప్పినట్టు మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. కేవలం పాకిస్తాన్,బంగ్లాదేశ్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడ అణచివేతకు గురైనా.. భారత్లో వారికి పౌరసత్వం ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. అదే సమయంలో ఎన్ఆర్సీ పేరుతో దేశ ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రశ్నించినట్టు చెప్పారు.
తెలంగాణలో ఎన్ఆర్సీ అమలుచేయం.. :
'ఎన్ఆర్సీ కారణంగా ప్రజల్లో లేని భయాందోళనలు నెలకొన్నాయి. ఏళ్లుగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు.. ఎవరీ వద్ద బర్త్ సర్టిఫికెట్స్ లేవు. ఇలాంటి పరిస్థితులు ఆందోళనలకు ,ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. కాబట్టి తెలంగాణలో ఎన్ఆర్సీ అమలుచేయబోమని నేను మీకు హామీ ఇస్తున్నా.' అని మహమూద్ అలీ వ్యాఖ్యానించారు.
ఎన్ఆర్సీపై కేటీఆర్ :
ఎన్ఆర్సీపై కేసీఆర్ స్పందించనప్పటికీ.. మంత్రి కేటీఆర్ మాత్రం పలుమార్లు దానిపై తమ వైఖరిని స్పష్టం చేశారు. ఆ చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఇటీవలే టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఎన్ఆర్సీని వ్యతిరేకించాలని కోరారు. దానిపై ఆయన సానుకూలంగా స్పందించినట్టు అసదుద్దీన్ తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఆ ప్రభావం ఉంటుందా..
ఈ నెల 22న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్ఆర్సీ,సీఏఏ ప్రభావం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తీని ప్రజల్లో నిలదీసి మరోసారి లబ్ది పొందాలని బీజేపీ భావిస్తోంది. ఇటీవల భైంసాలో జరిగిన అల్లర్లను కూడా టీఆర్ఎస్కు ప్రతికూలంగా మలచాలని బీజేపీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కోబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.