ధనిక రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించ లేరా.?కేసీఆర్ ది దోపిడి ప్రభుత్వమన్న బీజేపి.!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజల సొమ్ము దోపిడీ చేసి రాజ్యమేలుతుందని తెలంగాణ బీజేపి మండిపడింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెరుగుతున్న డీజిల్ పెట్రోలు ధరలను తగ్గించి సామాన్యుడికి అందుబాటు ధరలో పెట్రోల్ ఉత్పత్తులను అందించడానికి చర్యలు చేపట్టిందని, దేశంలోని చాలా రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్ ను తగ్గించుకున్నాయని బీజేపి స్పష్టం చేసింది. తెలంగాణ ధనిక రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పాలనలో పెట్రోల్ ఉత్పత్తులపై వాట్ తగ్గించకుండా సామాన్యుని దోపిడీ చేస్తుందని బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్ పాషా విమర్శించారు.
టీఆర్ఎస్ దోపిడి ప్రభుత్వం.. ప్రజావ్యతిరేత తప్పదన్న బీజేపి మైనారిటీ మోర్చా నేతలు
పెట్రోల్, డీజిల్ ల పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించు కోవాలని డిమాండ్ చేస్తూ బిజెపి మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్ పాషా టీఆర్ఎస్ విధానాలపై మండిపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వ 8 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు ఏమాత్రం సంతోషంగా లేరని స్పష్టం చేసారు. ముఖ్యంగా ప్రజలను దోచుకోవడమే పాలసీగా టిఆర్ఎస్ ప్రభుత్వం రాజరికపు పరిపాలన కొనసాగిస్తుందని అప్సర్ పాషా మండిపడ్డారు.
తెలంగాణలో అరాచకం రాజ్యమేలుతోంది.. కేసీఆర్ నియంత పాలన అన్న బీజేపి
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఉచిత పథకాలు సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవని అప్సర్ పాషా ఆరోపించారు. చంద్రశేఖర్ రావు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సామాన్య ప్రజల నుండి వివిధ రూపాల్లో అనేక విధాలుగా దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.పెట్రోల్ డీజిల్ పై పన్నుల రూపేణా సామాన్య ప్రజానీకాన్ని దోచుకుంటూ, తిరిగి పేదవాడి రవాణాకు అవసరమైన ఆర్టీసీ చార్జీలు పెంచడం చంద్రశేఖర్ రావు ప్రభుత్వ దోపిడీకి నిదర్శనమన్నారు. 30 రూపాయల్లో తయారయ్యే మద్యానికి పన్నుల రూపేణా వందల్లో వసూలుచేసి పేద మధ్యతరగతి జీవితాలతో చెలగాటమాడుతున్నారని చంద్రశేఖర్ రావుపై విరచుకుపడ్డారు.
ధనిక రాష్ట్రం ఐనప్పుడు వ్యాట్ ఎందుకు తగ్గించరు.. సూటిగా ప్రశ్నించిన బీజేపి మైనారిటీ సెల్
ప్రతి గ్రామంలో మద్యంఏరులై పారిస్తున్నారని, మద్యంతో వేల కోట్ల ఆదాయాన్ని గడిస్తూ సామాన్య ప్రజానీకాన్ని లూటీ చేస్తున్నారని, ఆరుగాలం కష్టించి పండించిన రైతు పంట విషయంలో అనేక కొర్రీలు పెడుతూ కొనుగోలు పేరుతో చంద్రశేఖర్ రావు ప్రభుత్వం డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా లీటర్ డీజిల్ పై పది రూపాయలు, పెట్రోల్ పై ఐదు రూపాయలు తగ్గించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు చేపట్టిన చర్యల్లో భాగంగా దేశంలోని చాలా రాష్ట్రాలు తమ వంతు బాద్యతగా ఆయా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించుకుని ఆ రాష్ట్రాల సామాన్య ప్రజలకు ఊరటనిచ్చాయని అన్నారు.
ప్రజా వ్యతిరేకత తప్పదు.. కేసీఆర్ కు ప్రజలు గుణపాఠం చెప్తారన్న బీజేపి
కానీ ధనిక రాష్ట్రం తెలంగాణలో మాత్రంపెట్రోల్ డీజిల్ ధరలను అదుపులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏలాంటి చర్యలు చేపట్టక శోచనీయమన్నారు. సామాన్య ప్రజలకు,పెట్రోల్ డీజిల్ ధరల భారాన్ని తగ్గించడానికి సీఎం చంద్రశేఖర్ రావు ఆలోచన చేయకపోవడం, తిరిగి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రకటనలు చేసి విమర్శలు చేయడం తగదన్నారు. తెలంగాణలో ప్రజా సొమ్ము దోచుకుంటుంది ఎవరో ప్రజలకు అర్థమవుతుందని, ఇప్పటికైనా సీఎం చంద్రశేఖర్ రావు పద్ధతి మార్చుకుని ప్రజలకు ఆర్ధిక భారం కలగకుండా వెంటనే పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ను తగ్గించుకోవాలని డిమాండ్ చేసారు.